Stock Market | ముంబై, డిసెంబర్ 27: అంతర్జాతీయ ట్రెండ్ సానుకూలత, దేశీయ ఆర్థిక ఫండమెంటల్స్ బలపడుతున్న సంకేతాలతో భారత స్టాక్ మార్కెట్ మరో కొత్త చరిత్ర సృష్టించింది. వరుసగా నాలుగో రోజూ బలమైన ర్యాలీ జరిపింది. బుధవారం బీఎస్ఈ సెన్సెక్స్ తొలిసారిగా 72,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించింది. తాజాగా 702 పాయింట్లు పెరిగిన ఈ సూచి 72,038 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 21,600 పాయింట్లస్థాయిని మొదటిసారిగా దాటేసింది. 213 పాయింట్ల భారీలాభంతో 21,655 పాయింట్ల వద్ద ముగిసింది. గతవారం ప్రధమార్థంలో చవిచూసిన నష్టాల నుంచి మార్కెట్ సులభంగా కోలుకోవడమే కాకుండా కొత్త రికార్డుస్థాయిల్ని చేరిందని, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం తగ్గుతున్న కారణంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ త్వరలోనే వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న ఆశాభావంతో శాంటా ర్యాలీ జరుగుతున్నదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. డిసెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టులు గురువారం ముగియనున్నందున, మార్కెట్లో కొంతమేర ఒడిదుడుకులు చోటుచేసుకోవచ్చని హెచ్చరించారు. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) బుధవారం రూ.2,926 కోట్ల నికర పెట్టుబడులు చేయగా, దేశీయ ఫండ్స్ రూ. 192 కోట్ల స్వల్ప విక్రయాలు జరిపినట్టు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
తాజా ర్యాలీలో సెన్సెక్స్ షేర్లలో అన్నింటికంటే అధికంగా అల్ట్రాటెక్ సిమెంట్ 4.23శాతం ఎగిసింది. జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, భారతి ఎయిర్టెల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లార్సన్ అండ్ టూబ్రో, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్సర్వ్లు 1-3 శాతం మధ్య లాభపడ్డాయి. మరోవైపు ఎన్టీపీసీ, టెక్ మహీంద్రాలు స్వల్పంగా నష్టపోయాయి. మిడ్, స్మాల్క్యాప్ షేర్లకు సైతం కొనుగోలు మద్దతు లభించింది. దీంతో బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.41 శాతం బీఎస్ఈ స్మాల్క్యాప్ ఇండెక్స్ 0. 20 శాతం చొప్పున పెరిగాయి.వివిధ రంగాల సూచీల్లో భారీగా మెటల్, ఆటో ఇండెక్స్లు 1.33 శాతం చొప్పున ర్యాలీ చేశాయి. కమోడిటీస్ ఇండెక్స్ 1.19 శాతం, టెక్ సూచి 0.96 శాతం, ఐటీ ఇండెక్స్ 0.68 శాతం, కన్జూమర్ డ్యూరబుల్స్ సూచి, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్లు 0.67 శాతం శాతం చొప్పున పెరిగాయి. యుటిలిటీస్, పవర్, సర్వీసుల సూచీలు నష్టపోయాయి.
యూఎస్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిసి, బుధవారం కడపటి సమాచారం అందేసరికి పాజిటివ్గా ట్రేడవుతున్నాయి. అమెరికా సూచీల్లో ఇప్పటికే నాస్డాక్, డోజోన్స్లు ఆల్టైమ్ రికార్డుస్థాయిని చేరగా, కీలకమైన ఎస్ అండ్ పీ-500 ఇండెక్స్ 2 శాతం దూరంలో ఉన్నది. ఇక ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్లు లాభాలతో ముగిసాయి. యూరప్లోని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ మార్కెట్లూ పెరిగాయి.
బుల్స్ పార్టీలోకి పీఎస్యూ బ్యాంక్లు కాస్త ఆలస్యంగా చేరాయని, ప్రస్తుత ట్రేడింగ్ శ్రేణి నుంచి అవి బ్రేక్అవుట్ చేసే అవకాశాలున్నాయని జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ టెక్నికల్ హెడ్ రాహుల్ శర్మ అంచనా వేశారు. పీఎస్యూ బ్యాంక్లు ప్రస్తుతం పటిష్టంగా కన్పిస్తున్నాయని, ప్రైవేట్ బ్యాంక్లు క్యాచ్అప్ చేసే ఛాన్స్ ఉన్నదని చెప్పారు. విదేశీ ఇన్వెస్టర్లు గత రెండు సెషన్లుగా ఇండెక్స్ ఆప్షన్లను కొంటున్నారని, ఇండెక్స్ ఫ్యూచర్స్లో లాంగ్ పొజిషన్లు కొనసాగిస్తున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో గురువారం సైతం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు పెరుగుతాయని అంచనా వేశారు.
వరుసగా నాలుగు ట్రేడింగ్ రోజుల్లో జరిగిన మార్కెట్ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద భారీగా రూ.11.11 లక్షల కోట్ల మేర పెరిగింది. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ గత గురువారం నుంచి ఈ బుధవారం వరకూ రూ.11,11,599 కోట్లు పెరిగి రూ.3,61,31,598 కోట్లకు చేరింది.