న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: ఈ-కామర్స్, ఎఫ్ఎంసీజీ, రిటైల్ రంగాల్లో గిడ్డంగులకు పెద్ద ఎత్తున డిమాండ్ కనిపిస్తున్నది. 2019 నుంచి గిడ్డంగులకున్న డిమాండ్లో 27 శాతం ఈ మూడు రంగాలకు చెందిన కంపెనీల నుంచే వచ్చిందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ, ఇండోస్పేస్ తాజా నివేదిక ఒకటి స్పష్టం చేసింది. ఇక్కడ జరిగిన సీఐఐ రియల్టీ సదస్సులో ‘ది త్రీ-మైల్ టేల్: డిసెక్టింగ్ ది న్యూ-ఏజ్ రిటైల్ సైప్లె చైన్ నెట్వర్క్’ పేరిట సీబీఆర్ఈ, ఇండోస్పేస్ తమ రిపోర్టును విడుదల చేశాయి. ఇందులో 2019 నుంచి ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి-జూన్) వరకు గిడ్డంగులకు వచ్చిన డిమాండ్లో ఈ-కామర్స్, ఎఫ్ఎంసీజీ, రిటైల్ రంగాల వాటా 27 శాతంగా ఉన్నట్టు పేర్కొన్నది.
గిడ్డంగులకు రిటైల్ రంగంలో పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నట్టు చెప్పిన సీబీఆర్ఈ, ఇండోస్పేస్.. హైపర్ మార్కెట్లు (51 శాతం), ఫ్యాషన్-దుస్తుల (32 శాతం) వ్యాపార సంస్థల నుంచి వేర్హౌజ్లకు ఆదరణ అధికమని వెల్లడించింది. 2019లో రిటైల్ రంగంలో గిడ్డంగులకున్న డిమాండ్ 8 శాతంగానే ఉంటే.. 2022లో 13 శాతానికి పెరిగినట్టు తెలియజేసింది. ఇక ఈ ఏడాది జనవరి-జూన్లో 9 శాతంగా ఉన్నట్టు స్పష్టం చేసింది. రాబోయే పండుగ సీజన్ దృష్ట్యా ఇది ఇంకా పెరిగే వీలుందన్న అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది.
‘భారతీయ రిటైల్ రంగం పరుగులు పెడుతున్నది. రిటైలర్లు తమ వ్యాపార విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో ఈ రంగంలో గిడ్డంగులకు డిమాండ్ ఉంటున్నది. ఇక నానాటికీ పెరుగుతున్న ఆన్లైన్ షాపింగ్తో ఈ-కామర్స్ కంపెనీలూ గిడ్డంగులను భారీగా ఏర్పాటు చేసుకుంటున్నాయి.’
-అన్షుమన్ , సీబీఆర్ఈ ఇండియా చైర్మన్
‘తయారీ రంగం నుంచేగాక థర్డ్ పార్టీ లాజిస్టిక్స్, ఈ-కామర్స్, రిటైల్, ఎఫ్ఎంసీజీ కంపెనీల నుంచీ గిడ్డంగులకు భారీ ఆదరణ కనిపిస్తున్నది. పుంజుకుంటున్న వ్యాపార కార్యకలాపాలకు దీన్నో నిదర్శనంగా చెప్పుకోవచ్చు. దేశంలో ఆన్లైన్ షాపింగ్ జోరుగా సాగుతుండటం కూడా కలిసొస్తున్నది.’
-రాజేశ్ జగ్గీ, ఎవర్స్టోన్ గ్రూప్ వైస్ చైర్మన్