Smart Phones | గత తొమ్మిదేండ్లలో దేశీయంగా స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి 20 రెట్లు పెరిగిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దేశీయంగా స్మార్ట్ ఫోన్ల తయారీపై ఆయన సమీక్ష నిర్వహించారు. గతంతో పోలిస్తే విదేశాల నుంచి స్మార్ట్ ఫోన్లు, మొబైల్ ఫోన్ల దిగుమతిపై ఆధార పడటం తగ్గిందన్నారు. 2014లో దేశీయ అవసరాల్లో 78 శాతం విదేశాల నుంచి స్మార్ట్ ఫోన్లు దిగుమతి చేసుకుంటే.. 2023లో 99.2 శాతం ‘మేడిన్ ఇండియా’ ఫోన్లు దేశీయంగా అమ్ముడవుతున్నాయని శనివారం ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ ఖాతాలో పోస్ట్ చేశారు.
జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశీయంగా 4.3 కోట్ల స్మార్ట్ ఫోన్లు అమ్ముడయ్యాయని మార్కెట్ రీసెర్చ్ సంస్థ కెనాల్యాస్ తెలిపింది. ద్వితీయ త్రైమాసికంలో 18 శాతం వాటాతో శాంసంగ్ మొదటి స్థానంలో నిలిచింది. జూలై- సెప్టెంబర్ త్రైమాసికంలో 79 లక్షల స్మార్ట్ ఫోన్లను శాంసంగ్ విక్రయించింది.
76 లక్షల స్మార్ట్ ఫోన్ల విక్రయాలతో షియోమీ, 72 లక్షల స్మార్ట్ ఫోన్ల అమ్మకాలతో వివో, రియల్ మీ 58 లక్షల ఫోన్లు, ఒప్పో 44 లక్షల ఫోన్ల విక్రయాలతో తర్వాతీ స్థానాల్లో నిలిచాయి. గతంతో పోలిస్తే 5జీ స్మార్ట్ ఫోన్లలో ఎంట్రీ లెవల్ క్యాటగిరీకి గిరాకీ పెరుగుతున్నది. శాంసంగ్, షియోమీ, ఆపిల్, ఒప్పో, వివో, రియల్ మీ, వన్ ప్లస్ వంటి స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు భారత్ లోనే తయారు చేస్తున్నాయి. ఆ బాటలోనే గూగుల్ తన ‘పిక్సెల్’ ఫోన్లు త్వరలో దేశీయంగానే తయారు చేయనున్నది.