BSE Record | దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం మరో మైలురాయిని అధిగమించాయి. భారత్ వృద్ధిరేటు (జీడీపీ) రూ.4 లక్షల కోట్లకు చేరువలో ఉండగా, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.333 లక్షల కోట్ల (4 లక్షల కోట్ల డాలర్లు) మార్క్ను క్రాస్ చేసింది. ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్ల ఎం-క్యాప్లో ఐదో స్థానాన్ని ఆక్రమించింది. అమెరికా, చైనా, జపాన్, హంకాంగ్ ఈక్విటీ మార్కెట్ల తర్వాత స్థానంలో బీఎస్ఈ నిలిచింది. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ రూ.83.31 వద్ద తచ్చాడింది. దీంతో బుధవారం ట్రేడింగ్లో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,33,26,881.49 కోట్ల మార్క్కు చేరుకున్నది.
ఇంతకుముందు బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల ఎం-క్యాప్ 2021 మే 24న మూడు లక్షల కోట్ల మార్క్కు చేరుకున్నది. అమెరికా, చైనా, జపాన్, హాంకాంగ్ స్టాక్ మార్కెట్ల ఎం-క్యాప్ విలువ 4 లక్షల కోట్ల డాలర్ల మార్క్ను దాటేశాయి. గతంలో 2007 మే 28న బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ తొలుత రూ.లక్ష కోట్ల డాలర్ల మైలురాయిని చేరుకున్నది. తిరిగి మరో 50 వేల కోట్లు.. అంటే 1.50 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుకోవడానికి ఏడేండ్లు అంటే (2014 జూన్ 6) 2,566 రోజులు పట్టింది. మరో మూడేండ్లకు 2017 జూలై 10కల్లా ఇది రెండు లక్షల కోట్ల డాలర్ల (1,130 రోజులు మైలురాయికి చేరుకున్నది. మళ్లీ మూడు సంవత్సరాల్లో 2020 డిసెంబర్ 16కల్లా 2.50 లక్షల కోట్ల డాలర్ల మార్క్ను అధిగమించింది.
మరోవైపు బ్రాడ్ మార్కెట్ ఎన్ఎస్ఈ-50 సూచీ నిఫ్టీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 శాతానికి పైగా వృద్ధి చెందింది. దలాల్ స్ట్రీట్లోకి కొత్త సంస్థల ఐపీవోలు పోటెత్తడంతో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్ అద్భుతంగా దూసుకెళ్లడంతో ఎస్ఎస్ఈ లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 51లక్షల కోట్లకు చేరుకున్నది. 2021 మేలో భారత్ స్టాక్ మార్కెట్లు మూడు లక్షల కోట్ల డాలర్ల క్లబ్లో చేరాయి. ఐపీఓల ద్వారా కొత్త సంస్థలు స్టాక్ మార్కెట్లలోకి ఎంటర్ కావడంతో వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ వృద్ధి చెందింది.
దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు 2023లో సుమారు రూ.లక్ష కోట్ల విలువ గల షేర్లు కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.177.5 లక్షల కోట్లు. ఈ ఏడాది బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 5,540.52 పాయింట్ల లబ్ధి పొందింది. ఈ ఏడాది సెప్టెంబర్ 15న బీఎస్ఈ-30 ఇండెక్స్ 67,927.23 పాయింట్లతో ఆల్టైం గరిష్ట స్థాయి రికార్డు నమోదు చేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్తోపాటు ఐటీ, ఆటో, సెలెక్టెడ్ ప్రైవేట్ బ్యాంకుల స్టాక్స్ మద్దతుతో ఈక్విటీ మార్కెట్లలో స్మార్ట్ ర్యాలీ కొనసాగింది. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 728 పాయింట్లు (1.1 శాతం) లబ్ధితో 66,902 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ-50 సూచీ నిఫ్టీ తొలిసారి 20 వేల మార్క్ను దాటేసింది. రెండు నెలల పై చిలుకు తర్వాత 207 పాయింట్లు (ఒక శాతం) లబ్ధితో 20,097 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.78 శాతం, స్మాల్ క్యాప్ 0.4 శాతం లబ్ధితో ముగిశాయి.