న్యూఢిల్లీ : ఓవైపు ఎడాపెడా లేఆఫ్స్, పదోన్నతుల నిలిపివేత, నూతన నియామకాలపై నియంత్రణలతో టెకీల్లో (IT Employees) గుబులు రేగుతుంటే మరోవైపు వారిపై బలవంతంగా వారానికి 50 గంటల పనిభారం మోపుతున్నారు. పరిశ్రమ విధానాలకు విరుద్ధంగా సుదీర్ఘ గంటలు పనిచేయిస్తుండటంతో ఐటీ ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోంది. యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఇటీవల ఇన్ఫోసిస్ వ్యవస్ధాపకులు నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలపై పరిశ్రమ భగ్గుమన్న క్రమంలో ఐటీ ఉద్యోగులపై పని ఒత్తిడి పెరుగుతున్న వార్తలు కలకలం రేపుతున్నాయి.
ప్రాజెక్ట్ డెడ్లైన్స్ పూర్తిచేయాలని ఉద్యోగులపై విపరీతమైన ఒత్తిడి తీసుకువస్తున్నారని, ఉత్పాదకతపై దృష్టి సారించకుండా ఎన్ని గంటలు పనిచేశారనేదానిపైనే కంపెనీలు ఫోకస్ చేస్తున్నాయని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మౌలిక వసతుల లేమికి తోడు ఎక్కువ గంటలు ప్రయాణాలకే సరిపోవడం, పనిలో ఒత్తిళ్లు టెకీలను చిత్తు చేస్తున్నాయి.
కంపెనీ రాబడులు పెరుగుతున్నా ఉద్యోగిపై వెచ్చించే ప్రతి రూపాయి వ్యయానికి మించి అత్యధిక ఉత్పాదకతను కోరుతుండటం ఉద్యోగుల వర్క్-లైఫ్ బ్యాలెన్స్పై ప్రభావం చూపుతోంది. ఈ లెక్కలు ఇలా ఉంటే టెకీల్లో వర్క్-లైఫ్ బ్యాలెన్స్ దాదాపు 58 శాతం మందిలో పేలవంగా ఉందని టీంలీజ్ డిజిటల్ గణాంకాలు వెల్లడించడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఐటీ రంగం కుదేలవుతున్న వేళ ఉత్పాదకత, ఉద్యోగుల బాగోగులపై దృష్టిసారించకుండా కంపెనీలు కేవలం ఉద్యోగులపై అధిక పనిగంటల భారం మోపాలని చూడటంపై టెకీల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
Read More :
Layoffs | టెక్ స్టార్టప్స్లో లేఆఫ్స్ కలకలం : 120 మంది ఉద్యోగులపై ఫిజిక్స్వాలా వేటు