కెరియర్ ఆరంభంలోనే ఆకర్షణీయమైన జీతాలు. అందివచ్చిన ప్రతీ అవకాశాన్నీ ఒడిసిపడుతూ ముందుకు దూసుకెళ్తున్న ప్రతిభావంతులు. మూడు పదుల వయస్సులోనే జీవితంలో స్థిరపడుతున్న అదృష్టవంతులు.. ఇవీ మిల్లేనియల్స్ గురించి చెప్పాలంటే మచ్చు తునకలు. ప్రస్తుతం 28-43 ఏండ్ల మధ్యనున్న ఈ ఉద్యోగ, శ్రామిక శక్తికి పెట్టుబడులు, ఆర్థిక ప్రణాళికలపై నిపుణుల సలహా ఇదీ..1980 నుంచి 1995 మధ్య జన్మించినవారిని మిల్లేనియల్స్గా పేర్కొంటున్నారు. ప్రస్తుతం 28 నుంచి 43 ఏండ్ల మధ్య వయసున్న వీరంతా.. పెట్టుబడులు, ఆర్థిక ప్రణాళికపై అవగాహనతో ముందుకెళ్తే ఉజ్వల భవిష్యత్తేనని నిపుణులు సలహా ఇస్తున్నారు. అన్ని రంగాల్లో వేగంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటూ, అవకాశాలను చేజిక్కించుకుంటూ వెళ్తున్న మిల్లేనియల్స్కు ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ చేస్తున్న సూచనల విషయానికొస్తే..
రిటైర్మెంట్ ఫండ్ తప్పనిసరి
చిన్న వయస్సు నుంచే పదవీ విరమణ అనంతర జీవితం కోసం కూడబెట్టాల్సిన అవసరం ఉన్నది. నిజానికి ఈ ఆలోచన జీవితంలో ఎంత త్వరగా వస్తే అంత ఎక్కువగా రిటైర్మెంట్ ఫండ్ అనేది ఏర్పడుతుంది. నిధి పెద్దగా ఉంటే మరింత ఆనందదాయక జీవనం సొంతమవుతుందని మెజారిటీ నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే 20 ఏండ్లపాటు నెలకు రూ.10,000 చొప్పున పొదుపు చేస్తే.. 12 శాతం వార్షిక చక్ర వృద్ధిరేటుతో అది ఎంతలేదన్నా కోటి రూపాయలకు చేరుతుందని చెప్తున్నారు. ఇలా 30 ఏండ్లు శ్రమిస్తే సుమారు రూ.3.5 కోట్లకు రిటైర్మెంట్ ఫండ్ వెళ్తుందని అంటున్నారు. అలాగే ప్రతీ ఒక్కరికి తొలి 30 ఏండ్లు సంపాదన సమయం.. మలి 30 ఏండ్లు ఆదాయం లేని కాలంగా ఉంటుందన్న 30:30 రిటైర్మెంట్ రూల్ను మరువద్దని కూడా సూచిస్తున్నారు. కాబట్టి వీలైనంత త్వరగా రిటైర్మెంట్ ఫండ్కు ప్లాన్ చేసుకోవాలంటున్నారు.
ఈక్విటీల్లో పెట్టుబడులు
ఈక్విటీ అయినా.. డెట్ అయినా.. ఏ పెట్టుబడికైనా రిస్క్ ఉండనే ఉంటుంది. చివరకు సావరిన్ గ్యారెంటీగల పెట్టుబడులపైనా నష్టం వాటిల్లవచ్చు. కనుక ఈక్విటీలు లేదా నాన్-ఈక్విటీలు ఏవైనా కావచ్చు.. జీవిత లక్ష్యసాధనకు రిస్క్ ప్రభావం తప్పదు. ఈక్విటీ పెట్టుబడులను కాదని, నాన్-ఈక్విటీ అసెట్స్లో పెట్టుబడులను ఎంచుకుంటే.. రాబడులు సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. నిజానికి ఈక్విటీల్లో ఇన్వెస్ట్మెంట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనైనా.. దీర్ఘకాలంలో వాటిపై వచ్చే ప్రతిఫలాలు ఆకర్షణీయంగా ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో మిల్లేనియల్స్ ఈక్విటీ పెట్టుబడులపట్ల సంశయించరాదని సలహా ఇస్తున్నారు. అయితే అంతకన్నా ముందు ఆర్థిక నిపుణులను సంప్రదిస్తే.. ఇంకా మెరుగైన నిర్ణయాలు తీసుకోవచ్చని చెప్తున్నారు. డెట్ వంటి ఇతర అసెట్ క్లాసెస్.. పెట్టుబడుల సంరక్షణకే బాగా పనికొస్తాయని కూడా వారు పేర్కొంటున్నారు.
మ్యూచువల్ ఫండ్ సిప్స్..
గత కొన్నేండ్లుగా భారతీయ మదుపరులు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులకు దిగుతున్నారు. నిజానికి తమ దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు మదుపరులు సిప్ వేదికగానే నిర్ణీత నెలవారీ మొత్తాలను పొదుపు చేసుకోగలుగుతున్నారని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏదిఏమైనా ఏదో ఓ మ్యూచువల్ ఫండ్ స్కీం ద్వారా సిప్ పద్ధతిలో పెట్టుబడులకు శ్రీకారం చుట్టడం మంచి పనేనని సూచిస్తున్నారు. మీమీ రిస్క్ ప్రొఫైల్, లక్ష్యాలనుబట్టి డెట్, ఈక్విటీ, బ్యాలెన్స్డ్ ఇలా. ఏదో ఓ సరైన పథకాన్ని ఎంచుకొని ముందుకెళ్లాలని సలహా ఇస్తున్నారు. అయితే స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఏ మ్యూచువల్ ఫండ్ను ఆశ్రయిస్తే లాభిస్తుందో.. అవగాహన ఉన్నవారిని లేదా నిపుణులను అడిగి ఓ నిర్ణయానికి రావాలని చెప్తున్నారు. కాగా, ఇప్పుడిప్పుడే పెట్టుబడులకు వస్తున్నవారు రంగాలవారీ లేదా స్మాల్-క్యాప్ ఫండ్స్కు దూరంగా ఉండాలంటున్నారు.
బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు
సేవింగ్స్పై దృష్టిపెట్టేవారు తొలుత బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పైనే ఆసక్తి కనబరుస్తారు. వీటికి సురక్షిత పెట్టుబడి సాధనంగా పేరుండటమే కారణం. అయితే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు తొలి తరం మిల్లేనియల్స్ వెళ్తే ఆకర్షణీయమైన లాభాలు అందుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఒడిదుడుకులకులోనై ఉంటాయి కాబట్టి.. రిస్క్లను భరించేవారే ఓ నిర్ణయానికి రావడం మంచిదనీ చెప్తున్నారు. నిలకడైన పెట్టుబడులు, పరిమిత ఆదాయాన్ని ఇష్టపడేవారు ఎఫ్డీలకే మొగ్గు చూపవచ్చనీ సూచిస్తున్నారు. కాగా, ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా.. చిన్నచిన్నగా స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు వెళ్తే ప్రయోజనకరంగా ఉంటుందనీ సలహా ఇస్తున్నారు. మొత్తానికి పెట్టుబడులకు దిగే ముందు.. మన ముందున్న రకరకాల ఆప్షన్లను ఓసారి చూసుకొని ఎంచుకోవాలని అంటున్నారు.
పిల్లల భవిష్యత్తుకు..
చక్కని పిల్లల భవిష్యత్తు కోసం కూడా తెలివైన ఆర్థిక ప్రణాళిక అవసరం. పెండ్లి, పిల్లలు, కుటుంబ అవసరాలు ఇవన్నీ.. దాదాపుగా అందరిలో కనిపించేవే. అయితే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వారికోసం పొదుపును మొదలు పెట్టాలని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. విద్య విషయంలో ఎంతమాత్రం రాజీపడకూడదు. అందుకే పెద్ద మొత్తంలోనే ఈ అంశానికి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉన్నది. పెండ్లి ఖర్చులకూ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని, వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ పథకాల్లో పిల్లల కోసం చిన్నప్పట్నుంచే పొదుపు చేస్తే పెద్ద ఎత్తున ప్రయోజనం ఉంటుందని, ఇందుకు పోస్టాఫీస్ పథకాలను పరిశీలించాలని కూడా సూచిస్తున్నారు. బ్యాంకుల్లో పిల్లల పేరిట సేవింగ్స్ అకౌంట్లను తీసి సందర్భానుసారం వాటిల్లో కొంత మొత్తాలు వేసినా.. అవసరమున్నప్పుడు కలిసొస్తుంది. ఈ విషయం పిల్లలకూ చెప్తే వారికీ ఆర్థిక క్రమశిక్షణ అలవర్చినట్టవుతుంది.