అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ షాకివ్వడంతో ఇతర ప్రపంచ మార్కెట్లతో పాటు భారత్ సూచీలు సైతం గతవారం క్షీణించాయి. నిఫ్టీ 227 పాయింట్లు కోల్పోయి 18,269 పా యింట్ల వద్ద నిలిచింది. ఫెడ్ రేటు గరిష్ఠంగా 4.9 శాతంవరకూ పెరుగుతుందని, అటుతర్వాత రేట్లు తగ్గుతాయన్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఉండగా, ఫెడ్ చైర్మన్ జెరోమ్ పొవెల్ అందుకు భిన్నంగా ద్రవ్యోల్బణం దిగివచ్చేంతవరకూ కఠిన ద్రవ్య విధానం అమలు చేస్తామని, వచ్చే ఏడాది అంతా గరిష్ఠస్థాయిలోనే రేట్లు కొనసాగుతాయంటూ చేసిన ప్రకటన, ఫెడ్ కమిటీ సభ్యులు 5.1 శాతానికి ఫెడ్ రేటు చేరుతుందని సంకేతాలిచ్చారు.
ఈ నేపథ్యంలో వచ్చే వారం సైతం మార్కెట్ కరెక్షన్ బాటలోనే ఉంటుందని అధికశాతం విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ డెయిలీ చార్టుల్లో లోయర్టాప్ ఏర్పడటం, శుక్రవారం ఇంట్రాడే చార్టుల్లో డబుల్టాప్ రివర్సల్ ధోరణి కనపర్చినందున సూచీ మరింత క్షీణిస్తుందని మోతీలాల్ ఓస్వాల్ టెక్నికల్ హెడ్ చందన్ తపాడియా అంచనా వేశారు.
కీలక మద్దతు శ్రేణి 18,100-18,000
ఈ వారం నిఫ్టీ 18,350 దిగువన ట్రేడయితే మార్కెట్ బలహీనంగా ట్రేడవుతుందని చందన్ తెలిపారు. 18,080,18000 పాయింట్ల సమీపంలో మద్దతును పొందవచ్చని, 18,350, 18,440 స్థాయిల వద్ద నిరోధాన్ని చవిచూడవచ్చన్నారు. నిఫ్టీకి 18,100-18,000 శ్రేణిలో కీలక మద్దతు లభిస్తున్నదని కొటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ హెడ్ అమిత్ అథేవాలా తెలిపారు.
18,400 సమీపంలో అవరోధం కలగవచ్చని అంచనా వేశారు. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ టెక్నికల్ అనలిస్ట్ నాగరాజ్ షెట్టి సైతం 18,100-18,000 శ్రేణి మద్దతు అందించవచ్చని అంచనా వేశారు. 18,450-18,500 శ్రేణి నిరోధించవచ్చని తెలిపారు. నిఫ్టీ 18,350 దిగువన ముగిసినందున, వచ్చేవారం కరెక్షన్ కొనసాగుతుందని 18,130, 18000 స్థాయిల వద్ద మద్దతులు లభిస్తున్నాయని ఏంజిల్ ఒన్ రీసెర్చ్ హెడ్ సుమీత్ చౌహాన్ అంచనా వేశారు.