ముంబై : మనీల్యాండరింగ్ను నిరోధించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఫిన్టెక్ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగిస్తున్నాయి. భారీ పరిమాణాల్లో డేటాను ఏఐతో స్కాన్ చేసేందుకు నిఘా యంత్రాంగాలను వాడుతున్నాయని, దేశీ కంపెనీలు సైతం ఈ దిశగా ఏఐని విస్తృతంగా వాడుతున్నాయని ఇన్నోవేటివ్ డిజిటల్ సొల్యూషన్స్ సర్వీస్ ప్రొవైడర్ కియా.ఏఐ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ మిర్జాంకర్ వెల్లడించారు.
ఆర్ధిక రాజధాని ముంబైలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2023 సందర్భంగా మిర్జాంకర్ మీడియాతో మాట్లాడారు. సాంకేతిక రంగంలో మార్పులకు అనుగుణంగా దర్యాప్తు ఏజెన్సీలు, ప్రభుత్వ సంస్ధల విచారణ తీరుతెన్నుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు.
ఫిన్టెక్ కంపెనీలు తమ ప్రభుత్వ సంస్ధలు, క్లైంట్ల కోసం భారీ మొత్తంలో డేటాను స్కాన్ చేయడంతో పాటు ఆయా కంపెనీలు ఏ తరహా వ్యాపారంలో ఉన్నాయి, నిధుల ప్రవాహం ఎలా ఉంది..రుణ మొత్తాలను ఎలా వెచ్చిస్తున్నారు..? నిధుల దారిమళ్లింపు జరిగిందా అనే కోణంలో ఏఐని ఉపయోగించి కీలక సమాచారం రాబడతాయని తెలిపారు. మనీల్యాండరింగ్ను పసిగట్టడంతో పాటు నిధుల దారిమళ్లింపునూ ఏఐ గుర్తిస్తుందని రాజేష్ తెలిపారు. భారత ఫిన్టెక్ రంగం రోజుకు వంద కోట్ల లావాదేవీలు చేసే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు.
Read More :