Indians turns Dubai | సంపన్న భారతీయులు లగ్జరీ లైఫ్ కోసం దుబాయ్ తరలి వెళుతున్నారు. వ్యాపార వేత్తలు, పారిశ్రామిక వేత్తలు విలాస వంతమైన జీవనం కోసం, తమ ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. బుర్జ్ ఖలీఫాతోపాటు ఆకాశాన్నంటే రీతిలో ఇండ్లు, షాపింగ్ మాల్స్తో దుబాయ్.. టూరిస్ట్ హబ్గా నిలుస్తున్నదని 2022 రియల్ ఎస్టేట్ పెట్టుబడుల గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది దుబాయ్ రియల్ ఎస్టేట్ లావాదేవీలు రూ.35,500 కోట్ల (16 బిలియన్ దిర్హామ్లు)కు చేరుకున్నది. 2021 లావాదేవీలతో పోలిస్తే దాదాపు రెట్టింపు అని తెలుస్తున్నది. 2021లో దుబాయ్ రియల్ ఎస్టేట్లో ఇండియన్స్ 900 కోట్ల దిర్హామ్లుగా రికార్డయింది.
దుబాయ్లో ఇండ్లు కొనుగోలు చేస్తున్న ఇండియన్స్ 40 శాతం మంది ఉంటారు. వారిలో ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్), అహ్మదాబాద్, సూరత్, హైదరాబాద్, పంజాబ్ ప్రాంతాల వారు ఉన్నారు. వీరు కాక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన వారు 40 శాతం మంది, వివిధ దేశాల్లో నివసిస్తున్న ఇండియన్స్ 20 శాతం మంది దుబాయ్లో ఇండ్ల కొనుగోళ్లు జరిపారు.
స్కిల్డ్ ప్రొఫెషనల్స్, సైంటిస్టులు, రీసెర్చ్ స్కాలర్స్తోపాటు ప్రతిభావంతులైన కార్మికులు, ఉద్యోగులకు దుబాయి గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ 2022లో విస్తరించడం కూడా దుబాయ్ రియాల్టీ రంగ వృద్ధికి కారణం అని తెలుస్తున్నది. ప్రతిభావంతులైన విదేశీయులు పని లేదా విద్యావకాశాలతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నివాసం ఉండేందుకు దీర్ఘకాలిక గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ అనుమతి ఇస్తున్నది. విదేశీయుల నుంచి గిరాకీ పెరుగుతుండటంతో దుబాయ్ సిటీ పరిధిలోని రియల్ ఎస్టేట్ సంస్థలు కొంగ్రొత్త అపార్ట్మెంట్ ప్లాట్స్, విల్లా ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన రాహుల్ భాట్టాడ్ ప్రస్తుతం దుబాయ్లో నివసిస్తున్నారు. `ఇండియన్ కరికులంతో దుబాయ్లో పాఠశాలలు ఉండటంతో నా పిల్లలు సంతోషంగా ఉన్నారు. విద్యా వసతుల కల్పనలో ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా నిలుస్తుంది` అని రాహుల్ బట్టాడ్ చెబుతున్నారు. దుబాయ్ పూర్తిగా సురక్షిత నగరంగా నిలిచిందంటున్నారు. పూర్తిగా డబ్బు ఉన్నబ్యాగ్ను క్యాబ్లో మరిచిపోయినా.. మిమ్మల్ని సంబంధిత క్యాబ్ డ్రైవర్ గుర్తించి తిరిగి ఇచ్చేస్తున్నారని చెప్పారు.
వివిధ కార్పొరేట్ సంస్థల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్లుగా పని చేస్తున్న ప్రొఫెషనల్స్ కూడా దుబాయ్లో ఆస్తుల కొనుగోళ్లపై దృష్టి సారించారు. యావత్ ప్రపంచ దేశాలన్నింటికి దుబాయ్ వారధిగా నిలవడమే దీనికి కారణం అని చెబుతున్నారు. చాలా మంది భారతీయ కుబేరులు తమ దేశంలోని మెట్రో నగరాల నుంచి దుబాయ్కి వచ్చేస్తున్నారు. విలాసవంతమైన లైఫ్ కోసం అత్యధిక అద్దె గల అపార్ట్మెంట్లలోకి మారిపోతున్నారని ఓ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ సీఈవో చెప్పారు.
హైదరాబాద్, దుబాయ్, లండన్, కెనడా తదితర ప్రాంతాలకు నిరంతరాయంగా ప్రయాణించే వారికి వెసులుబాటు ఉంటుంది. భారత్ నుంచి పాశ్చాత్య దేశాలకు వెళ్లే వారు దుబాయ్ మీదుగా వెళ్లాల్సిందే. దీనికి తోడు దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్సియల్ సెంటర్ ఆధ్వర్యంలో ఫిన్టెక్ ఎకోసిస్టమ్ అందుబాటులోకి రావడం కూడా యువ భారత పారిశ్రామిక వేత్తలను దుబాయ్ ఆకర్షిస్తున్నది.