Indian Billionaires | న్యూఢిల్లీ, మే 21 : దేశీయ శ్రీమంతుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మళ్లీ తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 99.7 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదతో దేశీయ కుబేరుల జాబితాలో తొలిస్థానంలో నిలిచినట్టు ఫోర్బ్స్ మ్యాగజైన్ వెల్లడించింది. రూపాయి పాతాళంలోకి పడిపోయినప్పటికీ శ్రీమంతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. 2025లో 205 మంది బిలియనీర్లు ఉండగా, అదే ప్రస్తుత ఏడాదికిగాను 229 మందికి చేరుకున్నట్టు తెలిపింది. వీరి మొత్తం సంపద ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకున్నది అంతక్రితం ఏడాది వీరి సంపద 941 బిలియన్ డాలర్లు. వీరిలో టాప్-10 సంపన్న వర్గాల సంపద విలువ 368 బిలియన్ డాలర్లు. మొత్తం సంపదలో మూడోవంతు వీరి వద్దనే ఉన్నది.
ఈ జాబితాలో అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ 63.8 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. ముకేశ్, గౌతమ్ అదానీల వ్యక్తిగత సంపద ఈ ఏడాదిలో 14.7 బిలియన్ డాలర్లు పెరుగడం విశేషం. ఆ తర్వాత స్థానాల్లో ఓపీ జిందాల్ గ్రూపు చైర్పర్సన్ సావిత్రీ జిందాల్ చోటు దక్కించుకోగా, ఐదో స్థానంలో స్టీల్ టైకూన్ లక్ష్మీ మిట్టల్కు దక్కింది. ఆ తర్వాత స్థానాల్లో హెచ్సీఎల్ చైర్మన్ శివ్ నాడార్, సీరామ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ సైరస్ పూనావాలా, సన్ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ, బిర్లా గ్రూపు ఫౌండర్, కుమార మంగళం బిర్లా, డీమార్ట్ అధినేత రాధాకృష్ణ దామానీ, కొటక్ మహీంద్రా గ్రూపు ఫౌండర్ ఉదయ్ కొటక్లు ఉన్నారు.
పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ మళ్లీ ఫోర్బ్స్ జాబితాలోకి చోటుదక్కించుకున్నారు. పేటీఎం షేర్లు కుప్పకూలడంతో మూడేండ్ల క్రితం చోటు కోల్పోయిన విజయ్..కంపెనీ షేరు తిరిగి కోలుకోవడంతో ఆయన సంపద పెరిగింది.
ఈ జాబితాలో పలువురు తెలుగువారికి కూడా చోటు లభించింది. వీరిలో జీఎమ్మార్ గ్రూపు చైర్మన్ జీఎమ్రావు (3.9 బిలియన్ డాలర్లు), అపోలో గ్రూపు చైర్మన్ ప్రతాప్ రెడ్డి (3.6 బిలియన్ డాలర్లు), హెటిరో గ్రూపు చైర్మన్ బీ పార్థసారథి రెడ్డి(3.4 బిలియన్ డాలర్లు), బయోలాజికల్ ఈ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్లా(3.2 బిలియన్ డాలర్లు), అరబిందో ఫార్మా కో-ఫౌండర్ పీవీ రాంప్రసాద్ రెడ్డి (3 బిలియన్ డాలర్లు), ఎంఎస్ఎన్ గ్రూపు ఫౌండర్ ఎం సత్యనారాయణ రెడ్డి(2.9 బిలియన్ డాలర్లు) వ్యక్తిగత సంపదతో ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
