Nirmala Sitharaman | భారత ఫైనాన్సియల్ మార్కెట్ నియంత్రణ విధానాలు భేష్షుగ్గా ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. గతంలోనూ, ప్రస్తుతం, భవిష్యత్లోనూ ఇన్వెస్టర్లకు విశ్వసనీయమైన మార్కెట్ భారత్ అని స్పష్టం చేశారు. `సుపరిపాలన పద్దతుల అమలులో మన నియంత్రణ సంస్థలు చాలా కఠినంగా వ్యవహరిస్తాయి. ఒక ఘటన ఆధారంగా నిర్ధారణకు రాలేం` అని చెప్పారు. అమెరికా కేంద్రంగా పని చేస్తున్న షార్ట్షెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ బయటపెట్టిన నివేదికతో అదానీ గ్రూప్ సంస్థల షేర్లు భారీగా పతనం అవుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై వ్యాఖ్యలు చేశారు. అదానీ గ్రూప్ సంస్థల అంశంపై కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి స్పందించడం ఇదే తొలిసారి.
ఓ ఆంగ్ల టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. భారత ఫైనాన్సియల్ సెక్టార్ చాలా సమర్థవంతమైన నియంత్రణ పద్దతుల్లో నడుస్తున్నదని చెప్పారు. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువ పడిపోతున్నా.. ఆయా సంస్థల్లో ఇప్పటికీ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) వాటాలు లాభాల్లోనే ఉన్నాయన్నారు. అదానీ గ్రూప్ సంస్థల్లో తాము అనుమతించిన పరిమితి లోపే పెట్టుబడులు పెట్టినట్లు ఎల్ఐసీ, ఎస్బీఐ ప్రకటన చేశాయని సీతారామన్ గుర్తు చేశారు.
ఈనాడు భారతీయ బ్యాంకింగ్ రంగం చాలా సౌకర్యవంతంగా ఉందని, బ్యాంకులు చాలా శక్తిమంతంగా ఉన్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. తాను బాధ్యతాయుతమైన భావనతో ఈ ప్రకటన చేస్తున్నట్లు చెప్పారు. వివిధ బ్యాంకుల మొండి బకాయిలు (నిరర్ధక ఆస్తులు) తగ్గుముఖం పడుతున్నాయన్నారు. మొండి బకాయిల రికవరీ సాగుతున్నదని అన్నారు. అన్ని వర్గాలకు ప్రయోజనం కల్పించేలా బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు.