Banks Record in IPO Fee | దేశ చరిత్రలో భారతీయ బ్యాంకులు ఈ ఏడాది ఆల్టైం రికార్డు నెలకొల్పాయి. కరోనా తర్వాత కోలుకుంటున్న పారిశ్రామిక సంస్థలు అదనపు నిధుల సేకరణకు ఐపీవోలకు వెళ్లిన సంగతి తెలిసిందే. మరికొన్ని సంస్థలు ఐపీవోల బాటలో ఉన్నాయి. ఐపీవోలతో దేశీయ బ్యాంకుల పంట పండింది. ఐపీవో ఫీజు రూపేణా ఇండియన్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులకు 2021 బెస్ట్ ఇయర్గా నిలుస్తుంది. ఈ ఏడాది దాదాపు రూ. 2,600 కోట్లు (347 మిలియన్ డాలర్లు) బ్యాంకులకు ఐపీవోల ఫీజు రూపంలో వచ్చింది. 2017లో ఐపీవోల ద్వారా వచ్చిన ఫీజుతో ఈ ఏడాది నాలుగు రెట్లు ఎక్కువ.
ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎంతోపాటు 110కి పైగా కంపెనీలు ఐపీవోలకు వెళ్లాయి. వాటిల్లో ఆన్లైన్ గ్రాసరీ డెలివరీ నుంచి ఫుడ్ డెలివరీ, బ్యూటీ స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి. ఈ సంస్థలన్నీ ఇన్షియల్ ప్రిఫరెన్షియల్ ఆఫర్ (ఐపీవో) ద్వారా స్టాక్ ఎక్స్చేంజ్ల్లో లిస్టయ్యాయి. బ్లూంబర్గ్ ఇండెక్స్ రూపొందించిన డేటా ప్రకారం ఈ ఏడాది ఐపీవోల ద్వారా ఆయా సంస్థలన్నీ 1800 కోట్ల డాలర్ల నిధులు సమకూర్చుకున్నాయి.
ఐపీవోల రంగంలో 2021 అసాధారణమైన సంవత్సరంగా నిలిచిపోతుందని కొటక్ మహీంద్రా క్యాపిటల్ కో ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ హెడ్ జయశంకర్ వెంకట్రామన్ చెప్పారు. తన 30 ఏండ్ల చరిత్రలో ఇటువంటి ఘటనలు చూడలేదన్నారు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల సిబ్బంది.. వర్క్ ఫ్రం హోం సేవలందించినా.. వారు ఏనాడూ స్విచ్ఛాఫ్ చేసుకోలేదన్నారు. పేటీఎం, జొమాటో, పీబీ ఫిన్టెక్ లిమిటెడ్, పాలసీ బజార్ తదితర సంస్థలు ఐపీవోలకు వెళ్లాయి.