హైదరాబాద్, జనవరి 19 (బిజినెస్ బ్యూరో): భారతీయ విమానయాన రంగానికి 2042కల్లా 2,500లకుపైగా కొత్త ఎయిర్క్రాఫ్ట్ల అవసరం ఉన్నదని బోయింగ్ కమర్షియల్ మార్కెటింగ్ ఉపాధ్యక్షుడు డార్రెన్ హస్ట్ శుక్రవారం అన్నారు. ఇక్కడ జరుగుతున్న ‘వింగ్స్ ఇండియా 2024’ సందర్భంగా ఏర్పా టు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. నానాటికీ పెరుగుతున్న ప్రయాణికులు, కార్గో డిమాండ్ దృష్ట్యా దక్షిణాసియా దేశాల్లోని విమానయాన సంస్థలు తమకున్న ఎయిర్క్రాఫ్ట్లను పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. దీన్నిబట్టి వచ్చే రెండు దశాబ్దాల్లో 2,700లకుపైగా కొత్త విమానాలు అవసరమన్నారు. ఇందులో ఒక్క భారత్లోనే 2,500లకుపైగా నయా ఎయిర్క్రాఫ్ట్ల అవసరం ఉందని అంచనా వేశారు. 2,300 సింగిల్ ఎస్సైల్, 400 వైడ్ బాడీ ఎయిర్క్రాఫ్ట్ల అవసరం ఉంటుందని వివరించారు.
కరోనాకు ముందున్న స్థాయికి..
ఆసియా దేశాల్లో విమానయాన రంగంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశం భారతేనని బోయింగ్ స్పష్టం చేసింది. కరోనాకు ముందున్న స్థాయికి మళ్లీ దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ పెరిగిందని తెలిపింది. కరోనాతో వచ్చిపడిన ఆంక్షల కారణంగా విమానయాన రంగం తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తిరిగి అంతా విమానాల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా ఈ రంగానికి పూర్వ వైభవం రాగా, గతంతో పోల్చితే ఇంకా ఎక్కువే డిమాండ్ కనిపిస్తున్నది. దీంతో ఆయా సంస్థలు తమకున్న విమానాలను పెంచుకోవాలని చూస్తున్నాయి. ఇప్పటికే ఆయా కంపెనీలు 1,200లకుపైగా కొత్త విమానాల కోసం ఆర్డర్లిచ్చాయి.
కార్గో విమానాలపై..
ప్యాసింజర్ ట్రాఫిక్లోనేగాక, కార్గోలోనూ భారతీయ మార్కెట్ పరుగులు పెడుతున్నట్టు బోయింగ్ తెలియజేసింది. ఈ క్రమంలోనే రాబోయే 20 ఏండ్లకుపైగా కాలంలో 80 వరకు కార్గో విమానాల అవసరం దేశీయ విమానయాన సంస్థలకుంటుందన్నది. ఇప్పుడు కేవలం 15 సరకు రవాణా విమానాలే ఉన్నట్టు గుర్తుచేసింది. ఇటీవల ఆకాశంలోనే బోయింగ్ విమానం డోర్ ఊడిపోయిన ఘటన నేపథ్యంలో ఆయా సంస్థలకిచ్చే కొత్త విమానాల ఆర్డర్లు ఆలస్యమవుతాయా? అన్న ప్రశ్నకు హస్ట్ స్పందిస్తూ.. అలాంటిదేమీ ఉండబోదన్నారు. అనుకున్న సమయానికే డెలివరీలుంటాయని, నాణ్యత విషయంలో రాజీపడబోమని చెప్పారు.
ఎయిర్బస్, హెలిగో జట్టు
హెలిగో చార్టర్ ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం చేసుకున్నట్టు ఎయిర్బస్ హెలిక్యాప్టర్స్ తెలిపింది. దేశంలో ఆఫ్షోర్, ఆన్షోర్ కార్యకలాపాల కోసం ఎయిర్బస్ హెచ్145 హెలిక్యాప్టర్ల సేవల నిమిత్తం ఈ డీల్ జరిగింది. కాగా, ఈ కాంట్రాక్ట్ కాలపరిమితి ఐదేండ్లు. ఇందులో నిర్ణీత రేటులో గంటలవారీగా చెల్లింపు విధానం ఉండనుండగా, ఇది హెలిగోకు లాభదాయకమని ఎయిర్బస్ పేర్కొన్నది. ఇక ఓఎన్జీసీ ఆఫ్షోర్ అవసరాలకు ఈ హెలిక్యాప్టర్ సేవలను అందిస్తున్నట్టు హెలిగో తెలియజేసింది.
జెట్సెట్గో మెగా డీల్
ఎయిర్ సర్వీసెస్ ఆపరేటర్ జెట్సెట్గో.. మూడు గ్లోబల్ ఏవియేషన్ టెక్నాలజీ సంస్థలతో 1.3 బిలియన్ డాలర్లకుపైగా విలువైన ఒప్పందాలను కుదుర్చుకున్నది. వీటిలో భాగంగా 280 హైబ్రిడ్-ఎలక్ట్రిక్ ఎయిర్క్రాఫ్ట్లు జెట్సెట్గోకు అందనున్నాయి. అయితే 130 విమానాలు అవసరమైతే తీసుకోవచ్చు లేదంటే మానుకోవచ్చు. కాగా, ఈ విమానాలను ఎయిర్పోర్ట్ ట్రాన్స్ఫర్స్, రీజినల్ కనెక్టివిటీ, ఇంటర్-సిటీ కమ్యూట్, ఇంట్రా-సిటీ షటిల్స్, అర్బన్ ఎయిర్ ట్యాక్సీలుగా జెట్సెట్గో వాడనున్నది.
మార్చికల్లా మరిన్ని ఆర్డర్లు
దేశీయ విమానయాన సంస్థలు విస్తరణపై దృష్టి పెట్టాయని, దీంతో వచ్చే ఏడాది మార్చికల్లా ఆయా సంస్థల ఎయిర్క్రాఫ్ట్ ఆర్డర్లు 2వేలను చేరవచ్చని ఏవియేషన్ రిసెర్చ్, కన్సల్టింగ్ సంస్థ క్యాపా ఇండియా తెలిపింది. ఇప్పటికే 1,620 కొత్త విమానాల ఆర్డర్లున్నాయని గుర్తుచేసింది. స్పైస్జెట్, గో ఫస్ట్ ఆర్డర్లు వీటిలో లేవన్నది. కాగా, ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశ ఎయిర్ తదితర సంస్థల ఆర్డర్లు ఇందులో ఉండగా, గురువారం ఆకాశ ఎయిర్.. బోయింగ్కు 150 విమానాల ఆర్డర్లిచ్చినది తెలిసిందే.