BPCL | కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థ.. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్).. పూర్తిస్థాయిలో బీపీసీఎల్లో వాటాల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. కానీ అందుకు బిడ్లను ఆకర్షించడంలో విఫలమైందని అధికార వర్గాలు తెలిపాయి. ఫలితంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్ర ప్రభుత్వ వాటాల ఉపసంహరణ నెమ్మదిగా సాగుతున్నదని సమాచారం. ఈ పరిస్థితుల్లో పూర్తిస్థాయిలో వాటాల ఉపసంహరణ కాకుండా.. విడతల వారీగా వాటాల ఉపసంహరణకు బిడ్లను ఆహ్వానించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది.
తొలుత బీపీసీఎల్లో కేంద్ర ప్రభుత్వానికి గల 52.98 శాతం వాటా విక్రయానికి ప్రయత్నాలు సాగాయి. కానీ ఇప్పుడు 20-25 శాతం ప్రభుత్వ వాటాల ఉపసంహరణకు బిడ్లను ఆహ్వానించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రణాళిక చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.
తొలిదశలో బీపీసీఎల్ విక్రయం ద్వారా 8-10 బిలియన్ల డాలర్ల నిధులు సేకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. నాలుగేండ్ల క్రితం ప్లాన్ రూపొందిస్తే, 2020లో బిడ్లు ఆహ్వానించింది బీపీసీఎల్. రష్యా రాస్నెఫ్ట్ ఆసక్తిగా ఉందని వార్తలొచ్చాయి. కానీ రాస్నెఫ్ట్ గానీ, సౌదీ అరామ్ కో గానీ బిడ్లు దాఖలు చేయలేదు. అప్పట్లో చమురు ధరలు తక్కువగా ఉండటం.. డిమాండ్ లేకపోవడంతో ఈ రెండు సంస్థలు తమ పెట్టుబడి ప్రణాళికలను పక్కన బెట్టాయని సమాచారం.
బీపీసీఎల్లో కేంద్రం వాటాలో 20-25 శాతం వాటా విక్రయ ప్రక్రియ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పూర్తి కాదని, 12 నెలలకు పైగా టైం పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వ అస్థిర విధానాలు కూడా కారణమని అంటున్నారు.