న్యూఢిల్లీ, అక్టోబర్ 20: ఇండియాలో ఉద్యోగుల వేతనాలు వచ్చే ఏడాది 10 శాతం వరకూ పెరగవచ్చని ఒక అంతర్జాతీయ సంస్థ అంచనావేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇండియాలోనే వేతనాల పెంపు అధికంగా ఉంటుందని గ్లోబల్ అడ్వయిజరీ, సొల్యూషన్స్ కంపెనీ విల్స్ టవర్స్ వాట్సన్ విడుదల చేసిన రిపోర్ట్లో వెల్లడించింది. 2021లో ఇండియాలో జీతాలు 8 శాతం పెరగ్గా, 2022లో ఈ పెంపుదల 9.3 శాతం ఉంటుందని తెలిపింది. ఈ సంస్థ 2021 మే-జూన్ మధ్యకాలంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో వివిధ రంగాలకు చెందిన 1,405 కంపెనీలు పాల్గొన్నాయి. ఇండియా నుంచి 435 కంపెనీలు పాలుపంచుకున్నాయి. వచ్చే 12 నెలల్లో వాణిజ్య అవకాశాల పట్ల ఇండియాలో మెజారిటీ కంపెనీలు ఆశాభావంతో ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది.