Smart Phone Sales | కరోనాతో అమల్లోకి వచ్చిన వర్క్ ఫ్రం హోం.. లెర్నింగ్ ఫ్రం హోం సంస్కృతి వల్ల దేశంలో మొబైల్ ఫోన్లు.. స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. గతేడాది స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లు రికార్డు నమోదు చేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 16.9 కోట్ల స్మార్ట్ ఫోన్లు అమ్ముడయ్యాయి. ఇది 2020తో పోలిస్తే 11 శాతం ఎక్కువ అని కౌంటర్ పాయింట్..వెల్లడించింది. 2020లో 15.2 కోట్ల విక్రయాలు జరిగాయి. 2019తో పోలిస్తే నాలుగు శాతం స్మార్ట్ తగ్గుముఖం పట్టాయి.
2021లో మొత్తం స్మార్ట్ ఫోన్ విక్రయాల్లో 17 శాతం 5జీ స్మార్ట్ ఫోన్లే. 5జీ స్మార్ట్ ఫోన్ ధరలు తగ్గుముఖం పట్టడంతోనే ఫోన్ల విక్రయాల్లో డబుల్ డిజిట్ నమోదైందని కౌంటర్ పాయింట్ అనలిస్ట్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గుర్గ్రామ్, అహ్మదాబాద్, పుణెల్లో ఈ ఏడాది చివరికల్లా 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో టెలికం సంస్థలకు 5జీ స్పెక్ట్రం కేటాయించే అవకాశం ఉన్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కథనాన్ని బట్టి తెలుస్తున్నది.
దేశీయంగా స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో రూ.10 వేల లోపు ధర కలవి 30 శాతం, రూ.20 వేల లోపు మార్కెట్ షేర్ కల స్మార్ట్ ఫోన్లు గరిష్ఠంగా 47 శాతం. రూ.30 వేల పై చిలుకు ధర కల స్మార్ట్ ఫోన్ల వాటా 10 శాతం. అంతర్జాతీయంగా గతేడాది స్మార్ట్ ఫోన్ల మార్కెట్పై శ్యామ్సంగ్ ఆధిపత్యం ప్రదర్శించింది. మొత్తం గ్లోబల్ స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో శ్యామ్సంగ్ 18.9 శాతం, ఆపిల్ 17.2 %, షియోమీ 13.5 శాతం వాటా కలిగి ఉన్నాయి. గతేడాది ఆపిల్ అత్యధిక ఐఫోన్లను విక్రయించింది.