న్యూఢిల్లీ, మే 20: విదేశీ పెట్టుబడులు ఆకట్టుకోవడంలో భారత్ దూసుకుపోతున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి 83.57 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. ఒక ఏడాది ఇంతటి స్థాయిలో ఎఫ్డీఐలు రావడం ఇదే తొలిసారని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2020-21లో 81.97 బిలియన్ డాలర్ల విలువైన ఎఫ్డీఐలు వచ్చాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎఫ్డీఐల్లో తయారీ రంగంలోకి 21.34 బిలియన్ డాలర్లు వచ్చాయి. 2020-21లో వచ్చిన 12.09 బలియన్ డాలర్లతో పోలిస్తే ఇది 76 శాతం అధికం.
భారత్లోకి వచ్చిన ఎఫ్డీఐల్లో సింగపూర్ నుంచి అత్యధికంగా వచ్చాయి. మొత్తం ఎఫ్డీఐల్లో 27 శాతం ఈ దేశం నుంచి వచ్చినట్లు పేర్కొంది. ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా(18 శాతం), మారిషస్(16 శాతం) వాటాతో వరుస స్థానాల్లో నిలిచాయి. అలాగే రంగాలవారీగా చూస్తే కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగాలు అత్యధికంగా ఎఫ్డీఐలను ఆకట్టుకున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో సేవల రంగం, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉన్నట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. విదేశీ పెట్టుబడులను ఆకట్టుకోవడానికి నరేంద్ర మోదీ సర్కార్..సంస్కరణలను మరింత సరళతరం చేయడం కూడా కలిసొచ్చింది. సులభతర వాణిజ్యం విధానం, అనుమతులను మరింత వేగవంతంగా లభించడం, ముఖ్యంగా బొగ్గు మైనింగ్, కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్ఛరింగ్, డిజిటల్ మీడియా, సింగిల్-బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్, పౌర విమానయానం, రక్షణ, బీమా, టెలికం రంగాల్లో ఎఫ్డీఐ మార్గదర్శకాల్లో పలు మార్పులు చేసిన విషయం తెలిసిందే.