న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: వచ్చే ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ 6.5 శాతంగా నమోదు కావచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ అంచనా వేసింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) వృద్ధిరేటును 7.3 శాతంగా అంచనా వేస్తున్న నేపథ్యంలో ఇది ప్రాధాన్యతను సంతరించుకున్నది. తాజా అంచనా.. 2024-25లో భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్తుందన్న సంకేతాలను ఇస్తున్నది మరి. నిజానికి ఒక్క రిజర్వ్ బ్యాంక్ మినహా మిగతా ఏజెన్సీల అంచనాలన్నీ 6.5 శాతం దరిదాపుల్లోనే ఉండటం గమనార్హం. ఆర్బీఐ వచ్చే ఆర్థిక సంవత్సరం దేశ వృద్ధిరేటు 7 శాతంగా ఉండొచ్చంటున్నది.
ఇక ఐఎంఎఫ్ 6.4 శాతమే అంటుండగా, ప్రపంచ బ్యాంక్, మోర్గాన్ స్టాన్లీలు కూడా 6.5 శాతమని చెప్తున్నాయి. కాగా, అంతర్జాతీయ మందగమన ప్రభావం భారతీయ ఎగుమతులపై ఉంటుందని ఇండియా రేటింగ్స్ హెచ్చరించింది. ఈ క్రమంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరం మరింత ప్రతికూల పరిస్థితులు ఎదురుకావచ్చని అభిప్రాయపడింది.