న్యూఢిల్లీ, డిసెంబర్ 3: భారతీయులు దేన్నైనా కొత్తగా ఆవిష్కరించి దాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారని ఆల్ఫాబెట్-గూగుల్ సీఈవో, భారత సంతతికి చెందిన టెక్నాలజీ దిగ్గజం సుందర్ పిచాయ్ అన్నారు. శుక్రవారం ‘హిందుస్తాన్ టైమ్స్ నాయకత్వ సదస్సు’లో మాట్లాడిన పిచాయ్.. దేశంలో స్టార్టప్ల కల్చర్ను చూస్తే సంబురమనిపిస్తున్నదన్నారు. ఈ క్రమంలోనే పైవిధంగా ప్రశంసించారు. ఔత్సాహిక వ్యాపార, పారిశ్రామికవేత్తల ఆలోచనల్ని అభినందించారు. నేడు ఎన్నో భారతీయ స్టార్టప్లు ప్రపంచ స్థాయిలో సత్తా చాటుతున్నాయని కొనియాడారు. భారతీయ స్టార్టప్లను ప్రోత్సహించేందుకు, వాటిని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు గూగుల్ కృషి చేస్తుందన్న పిచాయ్.. అందుకోసం కృత్రిమ మేధస్సు రూపంలో కావాల్సిన సాంకేతిక మద్దతును అందిస్తామని చెప్పారు. తాము కూడా గూగుల్పేతో సరికొత్త ఆవిష్కరణను ప్రపంచానికి పరిచయం చేశామన్నారు.
భవిష్యత్తు ఏఐదే
భవిష్యత్తు టెక్నాలజీ అంతా కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్)లదేనని పిచాయ్ అన్నారు. సాధారణ మొబైల్ ఫోన్లు.. స్మార్ట్ఫోన్లుగా ఎదిగిన తీరును ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. గూగుల్ లంబ్డా అనే ప్రోడక్ట్తో సరికొత్తగా వస్తున్నామని, ఇది ఏఐ ఆధారంగా పనిచేస్తుందని వివరించారు. క్లౌడ్, ఆండ్రాయిడ్ సేవలనూ మరింత బలపరుస్తున్నామని చెప్పారు. కాగా, ఓపెన్ ఇంటర్నెట్, రెగ్యులేషన్ల మధ్య సమతూకం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా పిచాయ్ అన్నారు.