న్యూఢిల్లీ/రోమ్, ఏప్రిల్ 13: దేశ వస్తూత్పత్తుల వాణిజ్య లోటు (ఎగుమతుల కంటే దిగుమతులు పెరగడం) ఏటేటా పెరుగుతూపోతున్నది. ఈ క్రమంలోనే గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఏకంగా 267 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.22 లక్షల కోట్లు)ను తాకింది. భారత వాణిజ్య చరిత్రలోనే ఇది అత్యధికం కావడం గమనార్హం. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన సంవత్సర కాలంలో దేశ ఎగుమతులు 447 బిలియన్ డాలర్లు (రూ.36.5 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. ఇదే సమయంలో జరిగిన దిగుమతులు 714 బిలియన్ డాలర్లు (రూ.58.3 లక్షల కోట్లు)గా ఉన్నాయి. దీంతో వాణిజ్య లోటు 267 బిలియన్ డాలర్లు (రూ.21.8 లక్షల కోట్లు)గా తేలింది. ఫలితంగా అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2021-22)తో పోల్చితే గత ఆర్థిక సంవత్సరం రూ.6.2 లక్షల కోట్లు ఎగబాకింది.
చమురేతర దిగుమతుల్లోనూ..
దేశీయ దిగుమతుల్లో ముడి చమురు వాటానే ఎక్కువన్న విషయం తెలిసిందే. ప్రపంచ చమురు ఉత్పత్తిలో 1 శాతం కంటే తక్కువగా ఉత్పత్తి చేస్తున్న భారత్.. ప్రపంచ చమురు వినియోగంలో 5 శాతం వాటాతో ఉన్నది. అయితే కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి దేశ చమురేతర దిగుమతులూ పెరుగుతున్నాయి. ఇదే ఇప్పుడు రికార్డుస్థాయి వాణిజ్య లోటుకు కారణమైందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2015-16, 2017-18, 2021-22ల్లో వాణిజ్య గణాంకాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే 2021-22లో తొలిసారి చమురు, చమురేతర వస్తూత్పత్తుల వాణిజ్య లోటు రూ.7.8 లక్షల కోట్ల చొప్పున నమోదైంది. దీంతో సుమారు రూ.15.6 లక్షల కోట్లకు చేరింది.
మిగులు నుంచి లోటు వైపునకు..
నిజానికి 2000-01 ఆర్థిక సంవత్సరంలో దేశ చమురేతర వాణిజ్యం మిగులులోనే ఉన్నది. నాడు దేశంలోకి వచ్చే చమురేతర వస్తూత్పత్తుల దిగుమతుల కంటే దేశం నుంచి విదేశాలకు జరిగే చమురేతర వస్తూత్పత్తుల ఎగుమతులే ఎక్కువ. దిగుమతుల కన్నా రూ.35,653 కోట్ల ఎగుమతులు ఎక్కువగా జరిగాయి. అందుకే అప్పట్లో భారత చమురేతర వస్తూత్పత్తుల వాణిజ్యం లోటులో కాకుండా మిగులులో ఉన్నది. కానీ 2021-22లో ఇది రూ.7.90 లక్షల కోట్లకు దిగజారింది. అంటే దేశం నుంచి జరిగే చమురేతర వస్తూత్పత్తుల ఎగుమతుల కన్నా దిగుమతులు పెరిగాయన్నమాట. వాస్తవానికి ఇదే ఏడాది చమురు ఉత్పత్తుల వాణిజ్య లోటు రూ.7.68 లక్షల కోట్లే. దీంతో మోదీ హయాంలో అటు ముడి చమురుతోపాటు ఇటు ఇతర వస్తూత్పత్తుల అవసరాలకూ భారత్ విదేశీ దిగుమతులపైనే ఆధారపడాల్సిన దుస్థితి దాపురించిందని తేలిపోయింది.
మేకిన్ ఇండియా వట్టిదేనా..
గడిచిన తొమ్మిదేండ్ల చరిత్రను తిరగేస్తే.. మోదీ సర్కారు ‘మేకిన్ ఇండియా’ వట్టి మాటలేనని తేలిపోతున్నది. తొలి విడుత కంటే, రెండో విడుత గద్దెనెక్కిన తర్వాత స్వదేశీ ప్రయోజనాల కన్నా విదేశాలకు లాభాలను కట్టబెట్టడానికే బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం పెద్దపీట వేసినట్టు అర్థమవుతున్నది. 2017-18 నుంచి క్రమేణా పెరుగుతున్న వాణిజ్య లోటే ఇందుకు ఉదాహరణ. దేశ ఎగుమతులను మించి నమోదవుతున్న దిగుమతులు.. వాణిజ్య లోటును ఎగదోస్తున్నాయి మరి. దీంతో అన్ని వస్తూత్పత్తులు భారత్లోనే తయారైతే దిగుమతులు ఎందుకు? ఎలా? పెరుగుతున్నాయన్న ప్రశ్నలిప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి.