Crude Oil | దశాబ్ద క్రితం స్థాయికి ముడి చమురు ధర పెరిగింది..ప్రపంచంలోనే చమురు దిగుమతిలో మనదేశానికి మూడోస్థానం.. ఉక్రెయిన్పై రష్యా యుద్ధంతో క్రూడాయిల్ ధర మరింత పెరిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా నివారించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కేంద్రం తెలిపింది. వెనిజులా, ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతి చేసుకోవడంతోపాటు ఒపెక్ ప్లస్ దేశాలు చమురు ఉత్పత్తి పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు.
సోమవారం రాజ్యసభ క్వశ్చన్ అవర్లో సభ్యుల అనుబంధ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ రాయితీ ధరపై రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. రూపాయి-రూబుల్ లావాదేవీలతో రాయితీ ధరపై రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయమై రష్యా అధికారులతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని అన్నారు.
ఇటీవల ముడి చమురు ధరలు బ్యారెల్పై 130 డాలర్లను తాకాయి. ఇది 14 ఏండ్ల గరిష్ఠం. తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం బ్యారెల్ క్రూడాయిల్ ధర 108 డాలర్లుగా ఉంది. 130 రోజులుగా రికార్డు స్థాయిలో దేశీయంగా పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు సవరించలేదు. బ్యారెల్ ముడి చమురు ధర 81-82 డాలర్లుగా ఉండగా 2021 నవంబర్ 4న కేంద్ర ప్రభుత్వం చివరిసారిగా ధరలు సవరించింది. చమురు ధరల తగ్గింపునకు గల అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని హర్దీప్సింగ్ పూరీ చెప్పారు.