(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ):ప్రపంచ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్)లో ఒకప్పుడు వెలుగువెలిగిన భారత్ ప్రస్తుతం తన ప్రభావాన్ని కోల్పోయింది. అంతర్జాతీయ ఐదో అతిపెద్ద ఎం-క్యాప్ గుర్తింపును కోల్పోయింది. అదానీ ఉదంతం నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు గత కొన్ని వారాలుగా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. దీనికి తోడు డాలర్ మారకంతో రూపాయి విలువ అంతకంతకూ దిగిజారడంతో ‘ఎం-క్యాప్’ ర్యాంకింగ్స్లో ఇప్పటివరకూ ఐదో స్థానంలో ఉన్న భారత్.. తాజాగా ఏడో స్థానానికి పడిపోయింది. ఇదే సమయంలో ఫ్రాన్స్ ఐదో స్థానానికి ఎగబాకగా.. భారత్ను అధిగమించి యూకే ఆరో స్థానానికి చేరుకున్నది.
30 రోజుల్లో తారుమారు
‘హిండెన్ బర్గ్’ ఆరోపణల నేపథ్యంలో అదానీ షేర్లు గడిచిన 30 రోజుల్లోనే రూ. 11 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశాయి. భారత స్టాక్ మార్కెట్లపై దీని ప్రభావం తీవ్రంగా పడింది. ఫలితంగా, ఈ ఏడాది 231 బిలియన్ డాలర్లను కోల్పోయిన (6.93 శాతం) భారత్.. 3.1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్కు పరిమితమైంది. తద్వారా ‘ఎం-క్యాప్’ జాబితాలోని టాప్-10 దేశాల్లో ఈ ఏడాది భారత్ వరెస్ట్-పర్ఫార్మర్గా నిలిచింది. టాప్-5 ర్యాంకుల్లో అమెరికా, చైనా, జపాన్, హాంకాంగ్, ఫ్రాన్స్ ఉన్నాయి.