న్యూఢిల్లీ : స్విట్జర్లాండ్తో చేసుకున్న సమాచార మార్పిడి ఒప్పందానికి అనుగణంగా ఆటోమేటిక్ రూట్ ద్వారా స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ఖాతాల వివరాలతో కూడిన మూడో విడత జాబితాను సోమవారం భారత్ అందుకుంది. ఏటా జరిగే ఈ కసరత్తు ద్వారా ఐరోపా దేశం 33 లక్షల ఖాతాల వివరాలను 96 దేశాలతో పంచుకుంటుంది. ఈ ఏడాది అంటిగ్వా, బార్బుడా, అజర్బైజన్, డొమినికా, ఘనా, లెబనాన్, మాకావు, పాకిస్తాన్, ఖతర్, సర్మోహ, వుతా వంటి మరో పది దేశాలతో కూడా సమాచార మార్పిడిని పంచుకుంటున్నామని ఫెడరల్ ట్యాక్స్ అడ్మిషినిస్ట్రేషన్ (ఎఫ్టీఏ) సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది.
96 దేశాలకు చెందిన ఖాతాదారుల పేర్లు, ఇతర వివరాలను ఎఫ్టీఏ బహిర్గతం చేయలేదు. ఇక భారత్ వరుసగా మూడో ఏడాది తమ జాతీయుల స్విస్ బ్యాంక్ ఖాతాల వివరాలను రాబట్టింది. ఈ జాబితాలో స్విట్జర్లాండ్ బ్యాంకులు, ఆర్ధిక సంస్ధల్లో పెద్దసంఖ్యలో ఖాతాదారులైన భారతీయ వ్యక్తులు, కంపెనీల వివరాలున్నాయి. స్విట్జర్లాండ్తో ఒప్పందంలో భాగంగా 2022 సెప్టెంబర్లో తదుపరి భారతీయ ఖాతాదారుల సమాచారాన్ని ఆ దేశం భారత్తో పంచుకోనుంది.