Internet | ఇప్పుడు 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు భారత్లో ఇంటర్నెట్ వినియోగం రోజురోజుకు పెరిగిపోతున్నది. 2022 డిసెంబర్ నాటికి దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు నెలకోసారైనా ఇంటర్నెట్ వాడుతున్నారు. దేశ జనాభాలో సగానికి పైగా అంటే 75.9 కోట్ల మంది (52 శాతం) ఇంటర్నెట్ వాడటం ఇదే ఫస్ట్ టైం.
భారత్లో ఇంటర్నెట్ వాడకంపై `ఇంటర్నెట్ ఇన్ ఇండియా-2022 అనే అంశంపై ఐఏఎంఏఐ, కాంటార్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వచ్చే రెండేండ్లలో 90 కోట్ల వరకు ఇంటర్నెట్ యూజర్లకు చేరుకుంటుందని తేలింది. ఇంటర్నెట్ యూజర్లలో 39.9 కోట్ల మంది గ్రామీణులు, 36 కోట్ల మంది పట్టణ వాసులు ఉన్నారు. పట్టణాల్లో ఆరు శాతం, గ్రామాల్లో 14 శాతం ఇంటర్నెట్ వాడకం వృద్ధి చెందింది. వచ్చే రెండేండ్లలో కొత్త ఇంటర్నెట్ వాడకం దారుల్లో 56 శాతం గ్రామీణులే ఉంటారని అంచనా.
ప్రస్తుతం గోవాలో అత్యధికంగా 70 శాతం, బీహార్లో 32 శాతం మాత్రమే ఇంటర్నెట్ వాడుతున్నారు. ఇంటర్నెట్ను ఎంటర్టైన్మెంట్, డిజిటల్ కమ్యూనికేషన్స్, సోషల్మీడియా వేదికల కోసం వాడుతున్నారని తేలింది. ఇంటర్నెట్ యూజర్లలో 54 శాతం మంది పురుషులు ఉన్నారు. కానీ, 2022లో కొత్తగా ఇంటర్నెట్ వాడుతున్న వారిలో 57 శాతం మహిళలు ఉన్నారు. రెండేండ్లలో ఇది 65 శాతానికి చేరతారని ఈ సర్వే అంచనా వేసింది.
మున్ముందు ఇంటర్నెట్ వాడకంలో మహిళలు, పరుషుల మధ్య అంతరాలు తగ్గుతాయని ఐఏఎంఏఐ, కాంటార్ సంయుక్త నివేదిక పేర్కొంది. 2021తో పోలిస్తే 2022లో డిజిటల్ చెల్లింపులు 13 శాతం పెరిగాయి. 33.8 కోట్ల మంది డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్ చేస్తున్న వారిలో గ్రామీణులు 36 శాతం మంది మాత్రమే ఉన్నారు. డిజిటల్ పేమెంట్స్లో 99 శాతం మంది యూపీఐ వాడుతున్నారని ఈ నివేదిక తెలిపింది.