World Bank Loan to India | భారత్లో ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రపంచ బ్యాంక్ ( World Bank ) ముందుకొచ్చింది. ప్రధాని ఆయుష్మాన్ భారత్ స్కీంతోపాటు దేశంలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడానికి రూ.13,834.54 కోట్ల (1.75 బిలియన్ డాలర్లు) రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. ఇందులో 100 కోట్ల డాలర్లు ఆరోగ్య రంగానికి, మరో 750 మిలియన్ల డాలర్లు ప్రైవేట్ రంగంలో పెట్టుబడులకు అంతరాయాన్ని భర్తీ చేసేందుకు డెవలప్మెంట్ పాలసీ లోన్ (డీపీఎల్) కింద రుణంగా మంజూరు చేయనున్నది.
భారత్లో ఆరోగ్య రంగ వృద్ధి కోసం, ఆరోగ్య రంగానికి మద్దతుగా 500 మిలియన్ల డాలర్ల చొప్పున రెండు అనుబంధ రుణాలు మంజూరు చేయడానికి ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. మొత్తంగా కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫాస్ట్రక్చర్ మిషన్ (పీఎం-ఏబీహెచ్ఐఎం)కు 100 కోట్ల రుణం ఇవ్వనున్నది.
ఆయుష్మాన్ భారత్ పథకం కోసం మంజూరు చేసిన ఈ రుణంతో దేశంలోని ప్రభుత్వ ఆరోగ్య రంగ మౌలిక వసతులను మెరుగు పరుస్తారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, మేఘాలయ, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఈ రుణం ద్వారా వచ్చే రుణాలను వినియోగిస్తారు.