Morgan Stanley on GDP | వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధిరేటును అంతర్జాతీయ రేటింగ్స్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తగ్గించి వేసింది. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర నేపథ్యంలో పైపైకి దూసుకెళ్తున్న ముడి చమురు ధరలు దెబ్బ తీస్తాయని పేర్కొంది. ఫలితంగా భారత్ వృద్ధి రేటు 50 బేసిక్ పాయింట్లు తగ్గి 7.9శాతానికి పడిపోతుందని అంచనా వేసింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి రిటైల్ ద్రవ్యోల్బణం ఆరు శాతానికి చేరుకుంటుందని వ్యాఖ్యానించింది. దీనివల్ల భారత్ విదేశీ వాణిజ్యంలో కరంట్ ఖాతా లోటు మూడు శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. కరంట్ ఖాతా లోటు పదేండ్ల నాటి స్థాయికి పెరిగిపోతుందని తెలిపింది.
భారత్ ఆర్థిక వ్యవస్థపై మూడు అంశాలు ప్రతికూల ప్రభావం చూపుతాయని మోర్గాన్ స్టాన్లీ పేర్కొన్నది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు, బంగారం ఇతర విలువైన లోహాల ధరలు, కఠినమైన ఆర్థిక పరిస్థితులు, బిజినెస్-ఇన్వెస్ట్మెంట్ సెంటిమెంట్ బలహీన పడి భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయనున్నాయి. భారత్ 85 శాతం విదేశాల నుంచి ముడి చమురు దిగుమతిపైనే ఆధారపడి ఉన్న సంగతి తెలిసిందే.
బ్యారెల్ ముడి చమురు ధర 140 డాలర్లకు చేరితే, ఇంధన అవసరాల కోసం ఖర్చు.. దాంతోపాటు ఇతర వస్తువుల ధరల పెరుగుదలకు దారి తీయనున్నదని మోర్గాన్ స్టాన్లీ వివరించింది. ప్రతి కుటుంబ ఖర్చులు, వ్యాపార లావాదేవీలు, ప్రభుత్వ సేవలపైనా ప్రభావం పడుతుందని పేర్కొంది. సూక్ష్మ ఆర్థిక సుస్థిరతకు ముప్పు పరిస్థితిని మరింత దారుణంగా మార్చేస్తుందని వెల్లడించింది.