న్యూఢిల్లీ, అక్టోబర్ 18: దేశంలో నూనెగింజల ధరలు తగ్గడంతో రైతులకు గిట్టుబాటు ధర లభించేందుకు పామాయిల్ దిగుమతులపై తిరిగి సుంకాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. దేశంలో వంటనూనెల ధరలు ఆకాశాన్నంటిన కారణంగా కొద్దినెలల క్రితం ముడి పామాయిల్ (సీపీవో), రిఫైన్డ్, బ్లీచ్డ్ పామాయిల్ (ఆర్బీడీ) సుంకాల్ని కేంద్రం తగ్గించింది. ప్రస్తుతం ముడి పామాయిల్పై బేసిక్ కస్టమ్స్ సుంకం జీరోకాగా, అగ్రికల్చర్ ఇన్ఫ్రా సెస్ 5 శాతం ఉంది.
రిఫైన్డ్పై 12.5 శాతం బేసిక్ కస్టమ్స్ సుంకం ఉంది. గతంలో సీపీవోపై బేసిక్ సుంకాన్ని పూర్తిగా ఎత్తివేసి, సెస్ను 8 శాతం నుంచి 5 శాతానికి, ఆర్బీడీపై బేసిక్ సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించారు. క్రూడ్ పామాయిల్పై తిరిగి బేసిక్ సుంకాన్ని విధించాలని, రిఫైన్డ్పై సుంకాన్ని పెంచాలన్న ప్రతిపాదనను ప్రస్తుతం తాము పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రైతులు, వినియోగదారుల ప్రయోజనాల్ని తాము దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే నూనె గింజల ధరలు భారీగా తగ్గుతున్నందున, దిగుమతి సుంకాల్ని పెంచాలంటూ పరిశ్రమ నుంచి కూడా విజప్తులు అందుతున్నాయని మరో ప్రభుత్వ అధికారి వెల్లడించారు.