న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: విదేశాల్లో పండించే పండ్లు బ్లూబెర్రీలు, క్రాన్బెర్రీలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని భారీగా 30 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. అలాగే మాంసం, టర్కీ కోళ్ల ఫ్రొజెన్ మాంసం దిగుమతులపై సుంకాన్ని 30 శాతం నుంచి 5 శాతానికి దించింది. భారత్-యూఎస్ల మధ్య ఇటీవల కుదిరిన పరస్పర అంగీకార ఒప్పదానికి లోబడి కేంద్ర వాణిజ్య శాఖ సిఫార్సుల మేరకు సుంకాలను తగ్గించినట్టు తాజా మార్పులు తక్షణం అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు.
గత వివాదాలను పరిష్కరించుకోవాలన్న నిర్ణయంలో భాగంగా ఇటీవలి జీ20 నేతల సదస్సులో భారత్-అమెరికాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయని, ఈ మేరకు కొన్ని ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాల్ని తగ్గించిందని నంగియా యాండర్సన్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ (ఇన్డైరెక్ట్ ట్యాక్స్) కుషుబు త్రివేది వివరించారు. భారత్లో అరుదుగా దిగుబడి అయ్యే ఈ ఐటెమ్స్పై సుంకాలు తగ్గినందున, భారత్ మార్కెట్లోకి యూఎస్ విస్తరించడంతో పాటు ఈ ఉత్పత్తుల ధరలు కూడా దేశంలో తగ్గుతాయని త్రివేది చెప్పారు. అలాగే డబ్ల్యూటీవోలో భాగమైన ఇతర దేశాలకు చూడా ఈ చర్య ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.
పొడుగుపింజ పత్తిపై సుంకం ఎత్తివేత
కాటన్ వస్ర్తాల తయారీ పరిశ్రమ లేవనెత్తిన ఆందోళనల నేపథ్యంలో పొడుగుపింజ పత్తిపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా ఎత్తివేసింది. 32ఎంఎం కంటే పొడవైన పత్తి దిగుమతులకు సుంకం ‘నిల్’ అని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.