ముంబై, సెప్టెంబర్ 15: దేశ కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) ఈ ఏడాది జూలైలో 7 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. గత ఏడాది జూలైలో ఇది 3.2 బిలియన్ డాలర్లుగానే ఉండటం గమనార్హం. అధిక వాణిజ్య లోటే ఇందుకు కారణమని మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. నిరుడు జూలైలో 28.2 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు.. ఈసారి జూలైలో 31.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఎగుమతులు-దిగుమతుల మధ్యగల వ్యత్యాసాన్నే వాణిజ్య లోటుగా పిలుస్తారన్న విషయం తెలిసిందే.
భారత్ నుంచి ఇతర దేశాలకు వెళ్లే వస్తూత్పత్తుల ఎగుమతుల విలువ కంటే.. ఇతర దేశాల నుంచి భారత్లోకి వచ్చే వస్తూత్పత్తుల దిగుమతుల విలువ ఎక్కువగా ఉంటే దాన్ని వాణిజ్య లోటుగా పేర్కొంటారు. ఈ లోటు ఎక్కువైతే అది కరెంట్ ఖాతా లోటును తీవ్రతరం చేస్తుంది. కాగా, అధిక దిగుమతులతో విదేశాలకు ఎక్కువగా చేసే చెల్లింపులు.. డాలర్లకు డిమాండ్ను తెచ్చిపెడుతున్నాయి.