Indian GDP | ప్రస్తుత దశాబ్ధిలో ప్రతియేటా దేశ ఆర్థిక వృద్ధిరేటు సుమారు ఏడు శాతం నమోదు కావాలని కేంద్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు వీ అనంత నాగేశ్వరన్ చెప్పారు. ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయని, మరోవైపు, డిజిటల్ ఎకానమీ పుంజుకుంటుందని న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన ఒక సదస్సులో అన్నారు. ఇప్పటికే ఐదో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ ఏడు శాతాన్ని అధిగమిస్తుందని కేంద్రం అంచనా వేస్తున్నది. ఈ ఏడాది శరవేగంగా వృద్ధి సాధిస్తున్నదని తెలిపింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 13.5 శాతం వృద్ధి సాధించడమే దీనికి నిదర్శనం అని పేర్కొంటున్నది.
పెరుగుతున్న ధరలను కట్టడి చేయడానికి ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు పెంచేయడంతో మున్ముందు గ్రోత్రేట్ నెమ్మదిస్తుందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. `ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు ఆరు శాతానికి పరిమితం అవుతుందని అంతర్జాతీయ ఫైనాన్సియల్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ దశాబ్ధిలో ప్రతియేటా ఏడు శాతం వృద్ధి సాధిస్తుందని నేను భావిస్తున్నా` అని అనంత నాగేశ్వరన్ చెప్పారు.
`భారత్ వృద్ధిరేటు చాలా తేలిగ్గా ఆరు శాతం నమోదవుతుంది. క్యాపెక్స్ (క్యాపిటల్ ఎక్స్పెండిచర్) పూల్ నుంచి 0.5, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి మరో 0.5 శాతం వృద్ధి జత కలుస్తుంది` అని అనంత నాగేశ్వరన్ అన్నారు. ఈ ఏడాది ఫారెక్స్ మార్కెట్లో డాలర్పై రూపాయి మారకం విలువ ఏడు శాతానికి పైగా పతనమైంది. వ్యాపార వేత్తలు గానీ, వినియోగదారులు గానీ దిగుమతి చేసుకునే వస్తువులపై ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. కరెన్సీపై దేశ ఆర్థిక వ్యవస్థ ఆధారపడదని అనంత నాగేశ్వరన్ అభిప్రాయ పడ్డారు. 2006-12 మధ్య ఇన్వెస్ట్మెంట్ స్పెండింగ్.. దేశ వృద్ధిరేటులో ప్రధాన భూమిక వహించిందని గుర్తు చేశారు.