న్యూఢిల్లీ : కూరగాయలు, పప్పు ధాన్యాలు, నూనెలు, ఉల్లి ఇలా ఏ నిత్యావసరాల ధరలను (Higher Inflation) కదిలించినా మోతెక్కుతున్నాయి. జులైలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏకంగా 15 నెలల గరిష్ట స్ధాయిలో 7.4 శాతానికి చేరిందని ఆర్ధిక మంత్రిత్వ శాఖ తాజా నివేదిక స్పష్టం చేసింది. రాబోయే కొద్దినెలల్లో ధరల సూచీ మరింత పైకి ఎగబాకుతుందని ఈ నివేదిక బాంబు పేల్చింది.
ధరల మంటతో ప్రభుత్వం, ఆర్బీఐ దిద్దుబాటు చర్యలకు దిగాలని ఈ నివేదిక స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో దేశీ వినిమయంతో పాటు పెట్టుబడుల డిమాండ్ వృద్ధి చెందడం కొనసాగుతుందని, వీటితో పాటు ప్రాంతీయ అనిశ్చితులు , ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పెంచుతాయని నివేదిక పేర్కొంది. మరోవైపు ఆగస్ట్లో ఇప్పటివరకూ లోటు వర్షపాతం నమోదవడంతో తాజా నిల్వలు వచ్చే వరకూ ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది.
రాబోయే కొద్ది నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం అధికంగా కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. అయితే టమాటా, ఉల్లి సహా పలు కూరగాయల ధరలు కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో రాబోయే రోజుల్లో ఆహార ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉందని ఈ నివేదిక పేర్కొనడం కొంత ఊరట కలిగిస్తోంది.
Read More :