కఠిన పాలసీ అనుసరిస్తామంటూ రిజర్వ్బ్యాంక్ సంకేతాలు
మూడోసారి కీలక వడ్డీ రేట్లు యథాతథం
ద్రవ్యోల్బణం అంచనాలు పెంపు
ప్రస్తుత త్రైమాసికంలో 6 శాతాన్ని మించుతుంది
సీఆర్ఆర్కు 10 శాతం ఇంక్రిమెంట్
బ్యాంక్ల నుంచి రూ.లక్ష కోట్లు ఆర్బీఐ చెంతకు
ముంబై, ఆగస్టు 10: రిజర్వ్బ్యాంక్ తాజా పాలసీ సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా అట్టిపెడుతూనే, మరోవైపు ఆహారోత్పత్తుల ధరలు ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తే కఠిన విధానాన్ని అవలంబిస్తామంటూ సంకేతాలిచ్చింది. ‘సరళ విధాన ఉపసంహరణ’ను పాటిస్తామంటూ ప్రకటించింది. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల కసరత్తు అనంతరం గురువారం నిర్ణయాల్ని వెల్లడిస్తూ రెపో రేటును 6.5 శాతం వద్ద నిలిపి ఉంచుతున్నట్టు వెల్లడించింది. 2022 మే నుంచి 250 బేసిస్ పాయింట్ల (2.5 శాతం) వరకూ వడ్డీ రేట్లను పెంచిన కేంద్ర బ్యాంక్ మార్పులేవీ చేయకపోవడం వరుసగా ఇది మూడవసారి. అయితే అనూహ్యంగా క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్ఆర్)ను తాత్కాలికంగా పెంచి, బ్యాంక్లకు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఇది 4.5 శాతం ఉండగా, పరిమితకాలం వాణిజ్య బ్యాంక్లకు ఇంక్రిమెంటల్ సీఆర్ఆర్ 10 శాతం వర్తింపచేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. అంటే మొత్తం సీఆర్ఆర్ 14.5 శాతానికి చేరుతుంది. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి రూ.లక్ష కోట్ల డబ్బును ఆర్బీఐ తీసుకుంటుందని అంచనా.
ఆహారోత్పత్తుల ధరలు ఆకాశాన్నంటడంతో రిజర్వ్బ్యాంక్ సైతం ద్రవ్యోల్బణం అంచనాల్ని పెంచకతప్పలేదు. ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 6 శాతాన్ని మించి 6.2 శాతాన్ని చేరుతుందని అంచనా వేసింది. గత సమీక్షలో అంచనా 5.2 శాతంతో పోలిస్తే భారీ పెరుగుదలనే ఆర్బీఐ చూస్తున్నది. ఇక 2024 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాల్ని సైతం 5.1 శాతం నుంచి 5.4 శాతానికి పెంచింది. తాజా నిర్ణయాల్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మీడియాకు వెల్లడిస్తూ ‘ద్రవ్యోల్బణం ఇలానే కొనసాగితే, మేం చర్యలు తీసుకోవాల్సిందే’నని అన్నారు. 2023 నాల్గవ త్రైమాసికంలో ధరలు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నామని చెప్పారు.కూరగాయల ధరలు త్వరితంగా తగ్గే అవకాశాలుంటాయని, ఎల్నినో వాతావరణ పరిస్థితులు, ప్రపంచ ఆహారోత్పత్తుల ధరల్ని నిశితంగా గమనించాల్సి ఉందని వివరించారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లక్ష్యానికి దించేందుకు ఆర్బీఐ కట్టుబడి ఉందని చెప్పారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023-24) దేశ ఆర్థిక వ్యవస్థ 6.5 శాతం వృద్ధి సాధిస్తుందని రిజర్వ్బ్యాంక్ అంచనా వేసింది. సగటు డిమాండ్ పరిస్థితులు బాగున్నాయని దాస్ తెలిపారు.