Nitin Gadkari | దేశభక్తికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కొత్త నిర్వచనం ఇచ్చారు. భారత్ నుంచి ఎగుమతులు పెంచి దిగుమతులు తగ్గించడమే దేశభక్తికి కొత్త విధానమన్నారు. పెట్రోల్, డీజిల్ దిగుమతులను నిలువరించడమే తన జీవిత లక్ష్యం అని ఆదివారం గోవా రాజధాని పనాజీలో జరిగిన ‘సాగర్ మంథన్ 2.0’లో మాట్లాడుతూ చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతి తగ్గించుకుంటే ఉగ్రవాదం కూడా తగ్గుతుందన్నారు.
ప్రస్తుతం దేశీయ పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతి బిల్లు రూ.16 లక్షల కోట్లని పేర్కొన్న నితిన్ గడ్కరీ.. బయో ఫ్యూయల్ వంటి ఆల్టర్నేటివ్ ఫ్యుయల్ వైపు ద్రుష్టి సారిస్తే దిగుమతి బిల్లు తగ్గుతుందన్నారు. తద్వారా ఆ సంపద పేదలకు పంపిణీ చేయొచ్చునన్నారు. దిగుమతులు తగ్గించి ఎగుమతులు పెంచడమే కొత్త దేశభక్తి విధానం అని అన్నారు. చమురు రంగం నుంచే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధిక జీఎస్టీ వస్తుందన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమ దిగుమతులే ఎక్కువ అని చెప్పారు.