Digital Payments | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: ఆగస్టులో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగిన డిజిటల్ చెల్లింపుల సంఖ్య గతంతో పోల్చితే ఎన్నో రెట్లు పెరిగి వెయ్యి కోట్లను అధిగమించింది. దీనికి ప్రధానంగా పర్సన్-టు-మర్చంట్ (పీ2ఎం) లావాదేవీల్లో పెరుగుదలే కారణమని ఓ నివేదిక పేర్కొన్నది. 2018 జనవరిలో యూపీఐ లావాదేవీల సంఖ్య 151 మిలియన్లుగా ఉన్నది. అయితే ఈ ఏడాది జూన్లో 9.3 బిలియన్లుగా నమోదైంది. ఇందుకు కారణం వ్యక్తుల నుంచి వ్యాపారులకు పెరుగుతూపోయిన యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులేనని వరల్డ్లైన్ రిపోర్టు వెల్లడించింది. అలాగే గత ఏడాది జనవరిలో జరిగిన మొత్తం యూపీఐ లావాదేవీల్లో పీ2ఎం లావాదేవీల వాటా 40.3 శాతంగా ఉంటే, ఈ జూన్లో 57.5 శాతానికి పెరిగినట్టు వరల్డ్లైన్ తెలిపింది. మున్ముందు ఇది మరింత పెరిగే వీలున్నట్టు చెప్పింది.
ఎక్కువగా చిన్న లావాదేవీలే
యూపీఐ ద్వారా జరుగుతున్న పీ2ఎం లావాదేవీల్లో సగటు లావాదేవీ విలువ తగ్గింది. నిరుడు జనవరిలో ఒక్కో లావాదేవీ సగటున రూ.885గా ఉన్నట్టు తేలింది. అయితే ఈ జూన్లో రూ.653గానే ఉన్నది. దీంతో యూపీఐ ఆధారంగా వ్యాపారులకు వ్యక్తులు ఎక్కువగా చిన్నచిన్న లావాదేవీలనే జరుపుతున్నారని రుజువైందంటూ వరల్డ్లైన్ తెలిపింది. ఇక ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఈటీసీ)కు సంబంధించి కూడా లావాదేవీలు పెరిగినట్టు నివేదికలో స్పష్టమైంది. పార్కింగ్ ప్లాజాలు ఇతరత్రా వాటికి చెల్లింపుల కోసం అత్యధికులు ఇప్పుడు నగదునుగాక యూపీఐనే ఎంచుకుంటున్నారని చెప్పింది. గత ఏడాది జనవరితో చూస్తే ఈ ఏడాది జూన్లో లావాదేవీలు 56.5 శాతం ఎగిసి 45.97 మిలియన్ల నుంచి 71.92 మిలియన్లకు చేరుకున్నాయి. నిరుడు ప్రథమార్ధం (జనవరి-జూన్)లో 1.57 బిలియన్ లావాదేవీలు జరుగగా, ఈ ఏడాది ప్రథమార్ధంలో 1.85 బిలియన్లకు ఎగబాకినట్టు వరల్డ్లైన్ వివరించింది. ఫలితంగా 17.6 శాతం వృద్ధి కనిపించింది. ఈటీసీ లావాదేవీల విలువ ఈ జనవరి-జూన్లో రూ.30,340 కోట్లుగా ఉన్నది. నిరుడు ఇదే వ్యవధితో పోల్చితే 25.3 శాతం పెరిగింది.