హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): విదేశీ పెట్టుబడిదారులకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం ఉన్నదని, ఇక్కడున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విదేశీ ఇన్వెస్టర్లకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. టీ హబ్లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి చెందిన మానే గ్రూపు అధ్యక్షులు జీన్ మానేతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఫ్రాన్స్ కేంద్రంగా కార్యాకలాపాలు అందిస్తున్న మానే గ్రూపు ఇప్పటికే రాష్ట్రంలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. విస్తరణ కార్యకలాపాల్లో భాగంగా ప్లాంట్ సామర్థ్యాన్ని రెండింతలు పెంచడానికి మరో రూ.200 కోట్ల నిధులను వెచ్చించనున్నట్లు మానే గ్రూపు అధ్యక్షులు జీన్ మానే ఈ సందర్భంగా తెలిపారు. 2003 నుంచి రుచికరమైన తినే పదార్థాలను తయారు చేస్తున్న సంస్థ.. ఇక్కడున్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు.