న్యూఢిల్లీ, మే 23: ఆదాయ పన్ను (ఐటీ) శాఖ గడిచిన 2022-23 ఆర్థిక సంవత్సరానికి (2023-24 మదింపు సంవత్సరం)గాను వ్యక్తులు (వేతన జీవులు, సీనియర్ సిటిజన్లు), నిపుణులు, చిరు వ్యాపారులు ఆన్లైన్లో దాఖలు చేసుకునేందుకు ఐటీ రిటర్న్ 1, 4 ఫారంలను అందుబాటులోకి తెచ్చింది. ఈ-ఫైలింగ్ పోర్టల్లో ఐటీఆర్-1, ఐటీఆర్-4లను దాఖలు చేసుకోవచ్చని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు ట్విట్టర్ వేదికగా ఐటీ శాఖ బదులిచ్చింది.
మిగతా ఐటీఆర్ ఫారాల దాఖలుకు త్వరలోనే వస్తాయని వివరించింది. కాగా, ఐటీఆర్-1ను ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లకు ఉద్దేశించారు. ఐటీఆర్-4ను రూ.50 లక్షల వార్షిక ఆదాయం మించకుండా, ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ను ఎంచుకున్న వ్యాపారులు, వృత్తి నిపుణుల కోసం ఉద్దేశించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఐటీఆర్ లను దాఖలు చేయడానికి చివరి తేదీ ఈ ఏడాది జూలై 31. అయితే ఆడిటింగ్ అవసరం లేనివారికే ఈ గడువు.