IT Refund | వేతన జీవులు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లు.. చిరు వ్యాపారులు ప్రతి ఒక్కరూ గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. ప్రభుత్వ, కార్పొరేట్ రంగాల్లో పని చేస్తున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్ల వేతనాల్లో పన్ను శ్లాబ్ల ప్రకారం ముందస్తుగానే వేతనంలో ‘టీడీఎస్’గా కోత విధిస్తాయి కంపెనీలు. ఆ టీడీఎస్ రూపంలో కోత విధించిన వేతనం రీఫండ్ కోసం వారు క్లయిమ్లు దాఖలు చేస్తుంటారు. ప్రారంభంలోనే క్లయిమ్లు ఫైల్ చేసిన వారి ఐటీఆర్లు పరిశీలించేశారు ఆర్థికశాఖ, ఐటీ విభాగం అధికారులు. కానీ, కొందరు ఆఖరి క్షణాల్లో ఐటీఆర్ ఫైల్ చేస్తారు. ఐటీఆర్ ఫైలింగ్ గడువు ముగిసి నెల కావస్తున్నది. కనుక చివరి రోజుల్లో.. ఆఖరి సమయంలో ఐటీఆర్ ఫైల్ చేసిన వారు రీఫండ్ కోసం ఎదురు చూస్తున్నారు. వేతన జీవులు సమర్పించే ఐటీఆర్ ఆధారంగా రీఫండ్ కావడానికి ఎంత టైం పడుతుందన్న అంశంపై సందేహం నెలకొంది.
ఐటీఆర్ ఫైల్ చేసిన నెలలోపు దాని ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయాలి. అలా చేయకపోతే సదరు ఐటీఆర్ ఫైలింగ్ చెల్లుబాటు కాదని ఇన్కం టాక్స్ డిపార్ట్మెంట్ తేల్చి చెప్పింది. ఈ-వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత సుమారు నాలుగైదు వారాల్లో రీఫండ్ .. సంబంధిత ఐటీఆర్ ఫైల్ చేసిన వ్యక్తుల ఖాతాల్లో డిపాజిట్ అవుతుందని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన వారం పది రోజుల్లోనే రీఫండ్ వచ్చేస్తుంది.
వేతన జీవులు సమర్పించిన ఐటీఆర్లను ఆదాయం పన్ను విభాగం ప్రాసెస్ చేయాలి. ఆదాయం పన్ను చట్టం-1961లోని 143 (1) సెక్షన్ ప్రకారం టాక్స్ పేయర్ల ఈ-మెయిల్ ఐడీతోపాటు ట్యాక్స్ పోర్టల్లో ఈ-ఫైలింగ్ ఖాతాకు మెసేజ్ వస్తుంది. ఐటీఆర్లో ఫైల్ చేసిన వివరాలు.. ఆదాయం పన్ను విభాగం వద్ద ఉన్న రికార్డులతో సరిపోలితే ఓకే.. ఎటువంటి లోపాల్లేకపోతే ఎంతమొత్తం రీఫండ్ అందుతుందో తెలియజేస్తుంది.
ఒక్కోసారి రీఫండ్ ఆలస్యం అవుతుంది కూడా. అటువంటప్పుడు ఐటీ విభాగం నుంచి వచ్చే అన్ని రకాల నోటీసులు జాగ్రత్తగా పరిశీలించాలి. లోపాలు గుర్తించినట్లు తెలిపారేమో చూడాలి. ఎప్పటికప్పుడు ఈ-ఫైలింగ్ పోర్టల్లో రీఫండ్ స్టేటస్ కూడా తనిఖీ చేస్తూ ఉండాలి. అయితే ఇంతకుముందు ఐటీఆర్ దాఖలు చేసిన సంవత్సరంలో తొమ్మిది నెలల్లోపు వారికి సమాచారం ఇవ్వాలి. అయితే 2021 ఏప్రిల్ నుంచి ఈ టైం మూడు నెలలకే కుదించింది కేంద్ర ఆర్థికశాఖ.