CBDT | గత పదేండ్లలో ఆదాయం పన్ను చెల్లింపు దారుల సంఖ్య రెండింతలకు పైగా పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారు 7.78 కోట్లకు చేరిందని కేంద్ర ప్రభుత్వ సంస్థ.. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. ‘2022-23 ఆర్థిక సంవత్సరానికి ఐటీ పన్ను దాఖలు చేసే వారి సంఖ్య 7.78 కోట్లకు చేరింది. 2013-14తో పోలిస్తే 104.91 శాతం గ్రోత్ కనిపించింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 3.8 కోట్ల మంది ఐటీఆర్ దాఖలు చేస్తే, నికరంగా రూ.6,38,596 కోట్ల పన్ను వసూలు కాగా, 2022-23లో రూ.16,63,686 కోట్లకు పెరిగింది. అంటే పన్ను వసూళ్లలో నికరంగా 160.52 శాతం గ్రోత్ నమోదైంది’ అని సీబీడీటీ తెలిపింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.18.23 లక్షల కోట్లు వసూలు చేయాలని గతేడాది ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరం అంచనాలతో పోలిస్తే ఇది 9.75 శాతం ఎక్కువ. 2022-23 ఆర్థిక సంవత్సరంలో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 173.31 శాతం పెరిగి రూ.19,72,248 కోట్లకు పెరిగాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.7,21,604 కోట్లు. 2013-14 జీడీపీలో పన్ను శాతం 5.62 శాతం ఉంటే 6.11 శాతానికి పెరిగిందని సీబీడీటీ తెలిపింది. 2013-14లో పన్నువసూళ్ల ఖర్చు 0.57 శాతం తగ్గితే, 2022-23లో 0.51 శాతానికి తగ్గింది.