Rishab Shetty | భారతీయ సినీ పరిశ్రమలో గత కొన్నేళ్లలో అత్యంత సంచలన విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ‘కాంతార’ ఒకటి. తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడమే కాకుండా, భారతీయ సంస్కృతి, జానపద సంప్రదాయాలను ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేసింది. అనంతరం విడుదలైన ‘కాంతార: చాప్టర్ 1’ కూడా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుని ఫ్రాంచైజీ స్థాయిని మరింత పెంచింది. ఈ రెండు చిత్రాలలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా సమర్ధంగా నిర్వహించిన రిషబ్ శెట్టి ఇప్పుడు అభిమానులకు మరో సూపర్ అప్డేట్ ఇచ్చారు. ‘కాంతార’ విశ్వం ఇక్కడితో ముగియదని, మరో కొత్త అధ్యాయం రానుందని ఆయన అధికారికంగా ప్రకటించారు.
అంతర్జాతీయ మీడియా సంస్థ వెరైటీ (Variety) కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం తాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ‘జై హనుమాన్’ చిత్రంతో పాటు ‘కాంతార: చాప్టర్ 2’ స్క్రిప్ట్పై కూడా సమాంతరంగా పని చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తన రచయితల బృందంతో కలిసి కథను అభివృద్ధి చేస్తున్నామని, ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నామని చెప్పారు. దీంతో ‘కాంతార’ ఫ్రాంచైజీకి మరో భాగం ఖాయమని అభిమానులు సంబరపడుతున్నారు. ఈ సందర్భంగా దర్శకత్వంపై తనకున్న అభిరుచిని రిషబ్ శెట్టి మరోసారి స్పష్టం చేశారు. నటుడిగా ఎంత బిజీగా ఉన్నా దర్శకత్వాన్ని మాత్రం వదిలే ఆలోచన లేదని చెప్పారు.
దర్శకత్వం చేయాల్సిందే. దాన్ని నేను వదిలిపెట్టలేను. దర్శకత్వం చేస్తున్నప్పుడే నాకు మనశ్శాంతి, నిజమైన ఆనందం లభిస్తాయి. నా రచయితల బృందంతో కలిసి ఇప్పటికే కొత్త కథపై పని చేస్తున్నాం అని రిషబ్ శెట్టి తెలిపారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’ చిత్ర నిర్మాణంలో బిజీగా ఉన్నారు. అదే సమయంలో ‘కాంతార: చాప్టర్ 2’ కథా రచన కూడా కొనసాగుతోందని ఆయన వెల్లడించడంతో, ఈ రెండు ప్రాజెక్టులపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కాంతార: చాప్టర్ 2’ కథ ఎలాంటి నేపథ్యంలో సాగుతుంది? మునుపటి చిత్రాలకు కొనసాగింపుగా ఉంటుందా? లేక మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుందా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఏదేమైన రిషబ్ శెట్టి చేసిన తాజా ప్రకటనతో ‘కాంతార’ అభిమానుల్లో ఆనందం రెట్టింపైంది.