Income Tax Returns | వచ్చే ఆర్థిక సంవత్సర (2023-24) బడ్జెట్లో ఆదాయం పన్ను శ్లాబ్ల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల కథనం. అయితే, దీనిపై స్పందించేందుకు కేంద్ర ఆర్థికశాఖ వర్గాలు అందుబాటులోకి రాలేదు. మధ్యతరగతి వర్గ ప్రజల కోసం ఆదాయం పన్ను రాయితీని రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచుతారని వేతన జీవులు, ఆర్థికవేత్తలు, చిరు వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మీ ఆదాయం రూ.2.5 లక్షల్లోపు ఉంటే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ ఆదాయం రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల్లోపు ఉంటే ఐదు శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ.5 లక్షల్లో రూ.2.5 లక్షలకు పన్ను మినహాయింపు ఉంటుంది. మిగతా రూ.2.5 లక్షల నుంచి ఐదు శాతం పన్ను వసూలు చేసే అవకాశం ఉన్నా.. ఆదాయం పన్ను చట్టంలోని 87ఏ సెక్షన్ కింద మినహాయింపులు పొందొచ్చు. అంటే రూ.5 లక్షల వరకు ఆదాయం ఉన్నా ఆదాయం పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండకపోవచ్చు.
ఒకవేళ మీ ఆదాయం రూ.5 లక్షలకంటే ఎక్కువగా ఉంటే ఆదాయం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీ ఆదాయం రూ.5.10 లక్షలు ఉందనుకుందాం. అటువంటప్పుడు రూ.10 వేలు ఆదాయం పన్ను చెల్లించాలి. దానికి బదులు అందులో రూ.2.5 లక్షలు మినహాయిస్తే రూ.2.60 లక్షలపై మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కనుక రూ.2.50 లక్షల కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్న వారు తప్పనిసరిగా ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఆదాయం పన్ను రిటర్న్స్ (ఐటీ రిటర్న్స్) దాఖలు చేయడానికి కేంద్రం రెండు ఆప్షన్లు అందుబాటులోకి తెచ్చింది. 2020 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నూతన ఐటీఆర్ పాలసీని కేంద్రం తీసుకొచ్చింది. నూతన ఐటీ రిటర్న్స్ పాలసీ ప్రకారం రూ.5 లక్షలు దాటిన ఆదాయంపై పన్ను శ్లాబ్లు తగ్గించింది. కానీ మినహాయింపులు పూర్తిగా తీసేసింది. పాత ఐటీ రిటర్న్స్ పాలసీ ప్రకారం పలు రకాల డిడక్షన్లు క్లయిమ్ చేయొచ్చు.