న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ఆదాయపు పన్ను (ఐటీ) మిహాయింపు పరిమితిని ప్రస్తుత రూ.2.5 లక్షల నుంచి వచ్చే 2023-24 బడ్జెట్లో రూ. 5 లక్షలకు పెంచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పరిమితిని పెంచితే వినియోగదారుల వద్ద ఖర్చుచేయదగ్గ ఆదాయం మిగులుతుందని, దీంతో వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఆ వర్గాలు వివరించాయి.
ఇప్పుడు రూ.2.5 లక్షల ఆదాయం వరకూ పన్ను లేదు. 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్లకు రూ.3 లక్షలు, 80 ఏండ్లు దాటిన సూపర్ సీనియర్ సిటిజన్లకు రూ. 5 లక్షల ఆదాయం వరకూ పన్ను మినహాయింపు ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెడతారని భావిస్తున్నారు.