న్యూఢిల్లీ, ఆగస్టు 23: రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఆదాయం పన్ను (ఐటీ) శాఖ విచారణ నోటీసు జారీ చేసింది. రెండు స్విస్ బ్యాంక్ ఖాతాల్లో రహస్యంగా నిధులను దాచారన్న దానిపై ఇచ్చింది. ఈ ఖాతాల్లో రూ.814 కోట్లకుపైగా అప్రకటిత నిధులున్నాయని, వీటికి సంబంధించి రూ.420 కోట్ల పన్నుల ఎగవేత జరిగిందని ఐటీ శాఖ చెప్తున్నది. ఈ క్రమంలోనే నల్లధన చట్టం కింద ఈ నోటీసును పంపింది. అనిల్ అంబానీ పన్నులు ఎగ్గొట్టాలనే ఉద్దేశపూర్వకంగా తన విదేశీ బ్యాంక్ ఖాతా వివరాలను తెలియపర్చలేదని ఐటీ అధికారులు అంటున్నారు. కాగా, ఈ కేసులో అనిల్ అంబానీకి బ్లాక్మనీ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ యాక్ట్ 2015లోని సెక్షన్ 50, 51 కింద నోటీసు వచ్చింది. దీంతో దోషిగా తేలితే జరిమానాతోపాటు గరిష్ఠంగా పదేండ్ల జైలుశిక్ష పడనున్నది. ఇక ఈ నెలాఖర్లోగా ఈ వ్యవహారంపై బదులివ్వాలని షోకాజ్ నోటీస్లో ఐటీ శాఖ పేర్కొన్నది. ఈ నెలారంభంలోనే ఈ నోటీసు పంపినట్టు తెలుస్తున్నది. అయితే దీనిపై స్పందించేందుకు మాత్రం అంబానీ కార్యాలయ వర్గాలు అందుబాటులో లేవు. 2012-13 నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరాల మధ్య ఈ పన్నుల ఎగవేత జరిగినట్టు సమాచారం.
బ్రిటీష్ వర్జిన్ ఐస్లాండ్స్ (బీవీఐ)లో ఏర్పాటైన బహమాస్ ఆధారిత ‘డైమండ్ ట్రస్ట్’, ‘నార్తర్న్ అట్లాంటిక్ ట్రేడింగ్ అన్లిమిటెడ్’ సంస్థలు అనిల్ అంబానీకి చెందినవేనని ఐటీ శాఖ గుర్తించింది. అక్రమ నిధులు వెలుగుచూసిన రెండు స్విస్ బ్యాంక్ ఖాతాల్లో ఒకదాన్ని డైమండ్ ట్రస్ట్కు చెందిన డ్రీమ్వర్క్ హోల్డింగ్స్ ఐఎన్సీ నిర్వహిస్తున్నది. 2007 డిసెంబర్ 31 నాటికే ఇందులో 3.2 కోట్ల డాలర్లున్నాయి. తొలుత 2.5 కోట్ల డాలర్లు వచ్చినట్టు చెప్తున్న ఐటీ శాఖ.. ఈ సొమ్ము అనిల్ అంబానీ వ్యక్తిగత ఖాతా నుంచే డిపాజిట్ అయ్యిందంటున్నది. 2006లో ఈ ట్రస్ట్ ప్రారంభం కోసం కేవైసీ డ్యాక్యుమెంట్గా అంబానీ తన పాస్పోర్ట్ను ఇచ్చినట్టు తేలింది. ఇక ట్రస్ట్ లబ్ధిదారులుగా అంబానీ కుటుంబ సభ్యులే ఉండటం గమనార్హం. మరోవైపు 2010 జూలైలో ఏర్పాటైన ఇంకో సంస్థకు జ్యూరిచ్కు చెందిన బ్యాంక్ ఆఫ్ సైప్రస్లో ఖాతా ఉన్నది. ఈ కంపెనీకి అనిల్ అంబానీయే యజమాని అని ఐటీ శాఖ స్పష్టం చేసింది. 2012లో బహమాస్ నమోదిత పీయూఎస్ఏ సంస్థ నుంచి 10 కోట్ల డాలర్లు ఇందులోకి వచ్చాయి. దీనికీ యజమాని అంబానీయేనని ఐటీ శాఖ చెప్తున్నది.