హైదరాబాద్, సెప్టెంబర్ 26: వచ్చే 10-15 ఏండ్లలో హైదరాబాద్ వృద్ధిబాటలో పరుగులు పెడుతుందని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) తెలంగాణ ప్రెసిడెంట్ సునీల్ చంద్రా రెడ్డి చెప్పారు. నగరంలోని హైటెక్స్లో నరెడ్కో అక్టోబర్ 6 నుంచి మూడు రోజులపాటు ప్రాపర్టీ షో 2023ను ప్రారంభించనుంది. ఈ సందర్భంగా చంద్రా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం హైదరాబాద్ ఎంత వేగంతో విస్తరిస్తున్నదో, అదే వేగం ఎన్నో ఏండ్లు ఉంటుందని హామీ ఇస్తున్నానని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం జోరుగా చేపడుతున్న కొత్త రహదారుల నిర్మాణం, ఇతర మౌలిక అభివృద్ధి కార్యకలాపాలు, టీఎస్ఐపాస్, టీఎస్బీపాస్ తదితర సానుకూల విధానాల కారణంగా రాష్ట్రం భారీ పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్నదని నరెడ్కో ప్రెసిడెంట్ వివరించారు. ఎల్లవేళలా విద్యుత్ లభ్యతతో పాటు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ప్రాంతాల్లోనే కాకుండా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉన్నదని చెప్పారు.
ప్రభుత్వం కల్పించిన సదుపాయాలు, విధానాలు ఉపాధి కల్పనకు దోహదపడ్డాయని, ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో గత రెండేండ్లలో ఏడాదికి 1.5 లక్షల చొప్పున అదనపు ఉద్యోగాల సృష్టి జరిగిందన్నారు. అంతేకాకుండా దేశీయ బల్క్ డ్రగ్స్ రంగంలో 40 శాతం ఉత్పత్తి, 50 శాతం ఎగుమతులతో తెలంగాణ ఆధిపత్యం వహిస్తున్నదని చెప్పారు. లైఫ్ సైన్సెస్ రంగంలో కూడా గణనీయంగా దేశీయ ఉత్పత్తిలో 35 శాతం వాటా రాష్ర్టానిదేనని అన్నారు. దేశంలోకెల్లా అత్యధిక సెజ్లు కలిగిన రాష్ర్టాల్లో తెలంగాణ 30 సెజ్లతో ద్వితీయస్థానాన్ని ఆక్రమిస్తున్నదని చంద్రా రెడ్డి చెప్పారు. ఈ అంశాలన్నీ కలిసి హైదరాబాద్కు పెట్టుబడులు తీసుకు వస్తున్నాయని, దీంతో మరిన్ని ఉపాధి అవకాశాలు ఏర్పడటం, రియల్ ఎస్టేట్కు డిమాండ్ పెరగడం జరుగుతున్నదన్నారు. వివిధ ప్రమాణాల ఆధారంగా జీవనానికి ఉత్తమ నగరంగా హైదరాబాద్ను మెర్సర్తో సహా పలు అంతర్జాతీయ సంస్థలు రేట్ చేస్తున్నాయని చంద్రా రెడ్డి తెలిపారు. 2035కల్లా ప్రపంచంలో వేగంగా వృద్ధిచెందే నగరాల్లో హైదరాబాద్ నాల్గవ స్థానంలో ఉంటుందని ప్రతిష్ఠాత్మక ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ అంచనా వేసిందని చెప్పారు. హైదరాబాద్ వృద్ధి స్వల్పకాలానికే పరిమితం కాదని, వచ్చే 10,15 ఏండ్లూ వృద్ధి పరుగు కొనసాగుతుందన్నారు. 2023 ఏప్రిల్ నుంచి ప్రస్తుత సెప్టెంబర్ నెలవరకూ తెలంగాణలో 9.32 లక్షల ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని, రోజుకు సగటున 5,500 చొప్పున రిజిస్ట్రేషన్ల ప్రాసెసింగ్ జరిగిందన్నారు.