Private Airlines | న్యూఢిల్లీ, మే : వినీలాకాశంలోకి ప్రైవేటు ఎయిర్లైన్స్ ప్రయాణం ప్రారంభించిన గత మూడు దశాబ్దాల్లో సగటున దాదాపు ఏడాదికో కంపెనీ చొప్పున మూతపడ్డాయి. తాజాగా దివాలా పిటిషన్ వేసిన వాడియా గ్రూప్ కంపెనీ గో ఫస్ట్ మనుగడ కోసం కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. దేశంలో ప్రైవేటు విమానయానం ప్రారంభమైన1994 నుంచి ఇప్పటివరకూ 25 షెడ్యూల్డ్ ఎయిర్లైన్స్ సంస్థలు పూర్తిగా మూసివేయడం లేదా ఆర్థిక ఇబ్బందులతో మరో సంస్థలో విలీనంకావడం జరిగింది. తొలుత ఈస్ట్ వెస్ట్ ట్రావెల్స్ అండ్ ట్రేడ్ లింక్ కార్యకలాపాలు ప్రారంభించిన రెండేండ్లకే 1996 నవంబర్లో మూతపడింది. అదే ఏడాది మోదిలుఫ్ట్ సైతం ఎయిర్లైన్ వ్యాపారం నుంచి వైదొలిగింది. ప్రభుత్వ రంగ విమానయాన కంపెనీలైన ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ను టాటా గ్రూప్ కొనుగోలు చేసినందున, అవి కూడా ఇప్పుడు ప్రైవేటు సంస్థలే. ప్రస్తుతం అలియన్స్ ఎయిర్ మినహా మిగిలినవన్నీ ప్రైవేటు రంగానికి చెందినవే.
ఆర్థిక సంక్షోభంలో గో ఫస్ట్ కూరుకుపోవడంతో ఇతర విమానయాన సంస్థలు తమ విమాన టిక్కెట్టు ధరలను పెంచడానికి సిద్ధమవుతున్నాయి. గో ఫస్ట్ దివాలా పిటిషన్ దాఖలు చేయడంతోపాటు మూడు రోజుల పాటు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించడంతో ఎంపిక చేసిన రూట్లలో టిక్కెట్టు ధరలు పెరిగే అవకాశం ఉన్నదని ట్రావెల్ ఏజెంట్స్ గ్రూపు టీఏఏఐ తెలిపింది. ఇది ఎయిర్లైన్స్ ఇండస్ట్రీకి మంచిది కాదని, ఇప్పటికే కింగ్ఫిషర్, జెట్ ఎయిర్వేస్ మూతపడటంతో కోట్లాది రూపాయలు నష్టపోయామని, మరో సంస్థ దివాలా పిటిషన్ దాఖలు చేయడం దురదృష్టకరమని ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(టీఏఏఐ) ప్రెసిడెంట్ జ్యోతి మాయల్ తెలిపారు. అకస్మాత్తుగా గోఫస్ట్ విమాన సర్వీసులు రద్దు చేయడంపై టీఏఏఐ ఆందోళణ వ్యక్తం చేసింది. రైద్దెన విమానాలకు సంబంధించి టిక్కెట్లను రీఫండ్ చేయాలని సూచించింది.