(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): అదానీ గ్రూప్లో అవకతవకల ఉదంతంపై దర్యాప్తు చేపడుతున్న సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వ్యవహారశైలిపై తొలి నుంచి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ అదానీ ఉదంతంపై డెడ్లైన్ కంటే ముందే నివేదికను సమర్పించినప్పటికీ, సెబీ వాయిదాలు అడగడం, హిండెన్బర్గ్ ఆరోపణల తర్వాతనే అదానీ కంపెనీలపై నిఘా పెట్టినట్టు కోర్టులో పేర్కొనడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే, అదానీ గ్రూప్లో విదేశీ డొల్ల కంపెనీల పెట్టుబడులకు సంబంధించి 2014 జనవరిలోనే సెబీకి సమాచారం ఉన్నదని, ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అప్పటి హెడ్ నజీబ్ షా ఇదే అంశంపై సెబీకి లేఖ రాసినట్టు ఓసీసీఆర్పీ పేర్కొంది. అయితే, 2014 మేలో ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఈ విషయం మరుగునపడిపోయినట్టు
తెలిపింది.
ఏ నివేదిక.. ఏమని ఆరోపించింది?
సంస్థ పేరు: హిండెన్బర్గ్
ఏర్పాటు: 2017
వ్యవస్థాపకుడు: నాథన్ ఆండర్సన్
పనిచేసే కేంద్రం: అమెరికా
నివేదిక టైటిల్: హౌ ద వరల్డ్స్ థర్డ్ రిచెస్ట్ మ్యాన్ ఇజ్ పుల్లింగ్ ది లార్జెస్ట్ కాన్ ఇన్ కార్పొరేట్ హిస్టరీ.
ప్రధాన ఆరోపణ: అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన కుటుంబసభ్యులు స్టాక్ మ్యానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాలకు పాల్పడ్డారు. షేర్ల ధరలను కృత్రిమంగా పెంచారు. అప్పుల కోసం అడ్డదారులు తొక్కారు.
ఆరోపించిన తేదీ: జనవరి 24, 2023
సంస్థ పేరు: ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్
ఏర్పాటు: 2006
వ్యవస్థాపకులు: డ్రూ సులీవన్, పౌల్ రాడూ
పనిచేసే కేంద్రం: అమెరికా
నివేదిక టైటిల్: డాక్యుమెంట్స్ ప్రొవైడ్ ఫ్రెష్ ఇన్సైట్ ఇన్టూ అలిగేషన్స్ ఆఫ్ స్టాక్ మ్యానిప్యులేషన్ దట్ రాక్డ్ ఇండియాస్ పవర్ఫుల్ అదానీ గ్రూప్
ప్రధాన ఆరోపణ: అదానీ గ్రూప్లో ఆర్థిక అవకతవకలు జరిగాయి. భారత చట్టాలను ఉల్లంఘించే విధంగా అదానీ గ్రూప్లోని ప్రమోటర్లకు అత్యంత సన్నిహితులు స్టాక్స్లో భారీ పెట్టుబడులు పెట్టి, కృత్రిమంగా దాని విలువను భారీగా పెంచారు.
ఆరోపించిన తేదీ: ఆగస్టు 31, 2023