న్యూఢిల్లీ, జనవరి 16: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.16,373 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.12,259 కోట్ల లాభంతో పోలిస్తే 34 శాతం అధికం. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.51,208 కోట్ల నుంచి రూ.81,720 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. వచ్చే మూడు నుంచి ఐదేండ్లకాలంలో మొత్తం శాఖల సంఖ్య 13 వేలకు పెంచుకోనున్నట్టు బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శ్రీనివాసన్ వైద్యనాథన్ తెలిపారు. గత త్రైమాసికంలో కొత్తగా ఏర్పాటు చేసిన 146 శాఖలు కలుపుకొని గడిచిన 12 నెలల్లో బ్యాంక్ 908 శాఖలను ప్రారంభించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 1,481 శాఖలను స్టార్ట్ చేసింది.