న్యూఢిల్లీ : 2023 ఆర్ధిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు అంచనాను అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) 0.8 శాతం తగ్గించి 8.2 శాతానికి పరిమితం చేసింది. ఉక్రెయిన్పై రష్యా దండెత్తిన క్రమంలో వినిమయం, వృద్ధి కార్యకలాపాలపై ప్రభావం దృష్ట్యా వృద్ధి రేటులో కోత విధించినట్టు ఐఎంఎఫ్ పేర్కొంది.
ఫిబ్రవరి చివరి వారంలో ఉక్రెయిన్పై రష్యా దండెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా పలు ఉత్పత్తుల సరఫరాలపై పెను ప్రభావం చూపింది. మరోవైపు రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షల ఫలితంగా ఇంధన ధరలు భగ్గుమన్నాయి. పెట్రో సెగలతో ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తీవ్రతరమయ్యాయి. అధిక ఇంధన ధరలు ప్రైవేట్ వినిమయం, పెట్టుబడులపై ప్రభావం చూపనుండటంతో జపాన్, భారత్ వృద్ధి రేట్ల అంచనాను తగ్గించినట్టు ఏప్రిల్ 19న వెల్లడించిన వరల్డ్ ఎకనమిక్ రిపోర్ట్లో ఐఎంఎఫ్ పేర్కొంది.
కొవిడ్-19 నుంచి ఇటీవల చోటుచేసుకున్న రికవరీ ప్రయోజనాలను ఉక్రెయిన్ వార్ పరిణామాలు తోసిపుచ్చాయని పేర్కొంది. తాజా పరిణామాలు వృద్ధి అవకాశాలకు ముప్పుగా మారాయని స్పష్టం చేసింది. యుద్ధం నేపధ్యంలో దాని ఆర్ధిక పర్యవసానాలు వేగంగా విస్తృతంగా వ్యాప్తిస్తున్నాయని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ ఒలివిర్ గురించస్ ఆ నివేదికలో ఆందోళన వ్యక్తం చేశారు.