IMF-India Growth | భారత్ వృద్ధిరేటు అంచనాలపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) కీలక ప్రకటన చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6.8 శాతంగా ఉంటుందని మంగళవారం తెలిపింది. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6.5 శాతానికి పరిమితం కావచ్చునని పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ 6.5 శాతానికే పరిమితం అవుతుందని గత జనవరిలో పేర్కొన్నా, దేశీయ మార్కెట్లో సానుకూల ధోరణుల నేపథ్యంలో వృద్ధిరేటు అంచనాలు పెంచేసినట్లు తెలిపింది. తాజా ప్రకటనలో ప్రపంచంలోకెల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలువనున్నది. ఇదే కాలంలో చైనా ఆర్థిక వృద్ధిరేటు 4.6 శాతం ఉంటుందని ఐఎంఎఫ్ తెలిపింది. దీంతో చైనా ఎకానమీని భారత్ అధిగమించినట్లేనని తెలుస్తున్నది. త్వరలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు డైరెక్టర్ల సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో భారత్ జీడీపీపై ఐఎంఎఫ్ విడుదల చేసిన అంచనాలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఆస్తుల రంగంలో బలహీనతలను అధిగమించడంతోపాటు కరోనా మహమ్మారి తర్వాత వినియోగం పెరుగుదల, ద్రవ్య ఉద్దీపన చర్యలు తీసుకోవడంతో భారత్ వృద్ధిరేటు పుంజుకున్నదని ఐఎంఎఫ్ తెలిపింది. ఇదిలా ఉంటే 2023లో చైనా వృద్ధిరేటు 5.2 శాతం కాగా, 2024లో 4.6, 2025లో 4.1 శాతానికి పరిమితం అవుతుందని ఐఎంఎఫ్ వెల్లడించింది. మరోవైపు, గ్లోబల్ గ్రోత్ రేట్ 2023లో మాదిరిగానే 2024, 2025ల్లోనూ 3.2 శాతానికి పరిమితం అవుతుందని అంచనా వేసింది. ద్రవ్యోల్బణం, వృద్ధిరేటు నెమ్మదించాయని పేర్కొంది. కరోనా తర్వాత ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఇంధనం, ఆహార సంక్షోభం తలెత్తిందని తెలిపింది. ఈ ఏడాది చివరికల్లా ద్రవ్యోల్బణం 2.8 శాతానికి, 2025 నాటికి 2.4 శాతానికి దిగి వస్తుందని అంచనా వేసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ.. ప్రీ-కరోనా పరిస్థితుల నాటికి చేరుకున్నదనని తెలిపింది. కరోనా తర్వాత కొన్ని తక్కువ ఆదాయ దేశాలు జీవన ప్రమాణాల మెరుగుదలకు కష్టపడుతున్నాయని తెలిపింది.