IMF on India Growth | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధిరేటును అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) కుదించివేసింది. 2023-24లో భారత్ వృద్ధిరేటు 6.1 శాతం నుంచి 5.9 శాతానికి తగ్గిపోతుందని మంగళవారం తెలిపింది. అయినా, ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుందని పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో భారత్ వృద్ధిరేటు 6.8 నుంచి 6.3 శాతానికి పడిపోతుందని గత జనవరిలో ఐఎంఎఫ్ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 6.8 శాతం నుంచి 2023-24 వృద్ధిరేటు 5.9 శాతానికి తగ్గుతుందని ఇంతకుముందు పేర్కొంది.
భారత్ వృద్ధిరేటుపై భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) అంచనాల కంటే ఐఎంఎఫ్ అంచనాలు తక్కువగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధిరేటు ఏడు శాతం ఉంటుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ 6.4 శాతం ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సర వృద్ధి గణాంకాలను ఇంకా కేంద్ర ప్రభుత్వం వెల్లడించలేదు. 2022లో వృద్ధిరేటు అంచనాలు 6.8 నుంచి 5.9 శాతానికి పడిపోయినా ప్రపంచంలోనే భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని ఐఎంఎఫ్ తెలిపింది.
ఇదిలా ఉంటే గతేడాది మూడు శాతంగా ఉన్న చైనా వృద్ధిరేటు 2023లో 5.2 శాతం, 2024లో 4.5శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడి వంటి ఘటనలతో దెబ్బతిన్న గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ క్రమంగా రికవరీ సాధిస్తున్నదని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ పీర్రే ఓలివియర్ గౌరిన్చాస్ పేర్కొన్నారు. చైనా క్రమంగా బలోపేతం అవుతున్నదని తెలిపారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం తర్వాత ప్రపంచవ్యాప్తంగా సప్లయ్-చైన్లో అంతరాయాలు తగ్గుతున్నాయని అన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్లోబల్ వృద్ధిరేటు 2.8 శాతానికి పరిమితం అవుతుందని ఐఎంఎఫ్ పేర్కొంది. వచ్చే ఏడాది 3.0 శాతానికి పుంజుకుంటుందని తెలిపింది. ముందుగా ఊహించిన దానికంటే అంతర్జాతీయ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందన్నారు. 2022లో 8.7 శాతం నుంచి ఈ ఏడాది ఏడు, వచ్చే ఏడాది 4.9 శాతానికి గ్లోబల్ ద్రవ్యోల్బణం తగ్గుతుందని వెల్లడించింది.