వాషింగ్టన్, ఏప్రిల్ 19: భారత్ జీడీపీ వృద్ధి రేటు అంచనాల్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తగ్గించింది. ప్రస్తుత 2022 సంవత్సరంలో8.2 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. గతంలో 9 శాతం అంచనాల్ని ప్రకటించింది. భారత్ వృద్ధి మందగించినున్నప్పటికీ, ప్రపంచంలో వేగంగా వృద్ధి సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని తెలిపింది. ఇది చైనా అంచనా వృద్ధి 4.4 శాతానికి దాదాపు రెట్టింపు. అయితే ప్రపంచ ఆర్థికాభివృద్ధి మాత్రం ఈ ఏడాది బాగా తగ్గుతుందన్నది. 2021లో 6.1 శాతం పెరిగిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2022లో 3.6 శాతం మాత్రమే వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. ఐఎంఎఫ్ తన వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదికను మంగళవారం విడుదల చేసింది. 2023లో భారత్ వృద్ధి రేటు 6.9 శాతంగా ఉంటుందంటూ అంచనాల్ని ప్రకటించింది. కాగా 2021లో 8.9 శాతం వృద్ధిని సాధించింది. రష్యా-ఉక్రెయిన్ల యుద్ధం కారణంగా అధిక ఇంధన ధరలు, ఆహారోత్పత్తుల ధరలతో 2023లో భారత్ వృద్ధి రేటు తగ్గుతుందని అంచనా వేస్తున్నట్టు ఐఎంఎఫ్ తెలిపింది.